
Telangana Self-Enumeration Begins: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్న మంత్రి, ప్రజలందరూ ఇదే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దేశ జనాభా లెక్కల్లో ఖచ్చితమైన సమాచారం చేరుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా గణాంకాలకు కీలక ప్రాధాన్యం ఉందని, భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇవి ఆధారంగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు.
2027 జనగణనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పారదర్శకతలో దేశంలోనే నెంబర్ వన్గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.