Reading Time: 2 minutes
Garuda Purana Where Soul Stays For 13 Days After Death Beliefs Explained

Garuda Purana: గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణను ఇందులో రాశారు. ఈ పురాణం, జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను చర్చిస్తుంది. ఓ వ్యక్తి మరణించిన తర్వాత సాధారణంగా గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరణానంతరం ఆత్మ ఒక అద్భుతమైన, అదే సమయంలో క్లిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఈ పురాణం వివరిస్తుంది. ఇక ప్రయాణంలో మొదటి 13 రోజులు అత్యంత కీలకమని శాస్త్రం చెబుతోంది.

READ MORE: AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.

ఆ 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది?
మరణించిన వెంటనే ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదట. గరుడ పురాణం ప్రకారం.. ఓ మనిషి ప్రాణం పోయిన తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళతారట. అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాల లెక్కలు చూసి తిరిగి ఆ ఆత్మను వారి ఇంటి వద్దే వదిలేస్తారట. 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. సుదీర్ఘమైన పరలోక ప్రయాణానికి కావాల్సిన శక్తిని ఈ కర్మకాండల ద్వారా ఆ ఆత్మ పొందుతుందట. మరణించిన 13వ రోజున చేసే సంస్కారమే ఆత్మ అంతిమ వీడ్కోలని ఈ పురాణం వివరిస్తోంది. ఈ రోజుతో ఆ ఆత్మకు ఈ ప్రపంచంతో ఉన్న లౌకిక బంధాలు తెగిపోతాయట. 13వ రోజు చేసే కార్యక్రమాల వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుందని, అది యమలోక మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమవుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తర్వాతే ఆత్మ తన కర్మల ఆధారంగా వైతరణి నదిని దాటుతూ యమధర్మరాజు దర్బారుకు చేరుకుంటుందట. అందుకే 13వ రోజు చేసే దానధర్మాలు, బ్రాహ్మణ భోజనాలు ఆ ఆత్మకు మార్గమధ్యంలో ఉపశమనాన్ని కలిగిస్తాయని నమ్మకం. గరుడ పురాణం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే.. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసే మంచి పనులే మరణం తర్వాత అతడిని నీడలా వెన్నాడుతాయి.