
Mohsin Khan: రాజస్థాన్ రాయల్స్కు దొరికిన సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అరంగేట్రంలోనే అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ను సైతం దిక్కించుకున్నాడు. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడిని ఆపడం ఎవరి తరం కాదని అందరూ అభిప్రాయపడ్డారు. కట్చేస్తే నిన్నటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ చుక్కలు చూపించాడు. బుధవారం ఏకానా స్టేడియంలో జరిగిన పోరులో మొహ్సిన్ తన స్పెల్తో వైభవ్ను కట్టడి చేసేశాడు. ఈ సీజన్లో వైభవ్పై మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్గా మొహ్సిన్ రికార్డు సృష్టించాడు. కేవలం మెయిడెన్ వేయడమే కాకుండా ఆ ఓవర్ ఆఖరి బంతికి వైభవ్ను పెవిలియన్కు పంపి డబుల్ ధమాకా ఇచ్చాడు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు నమోదైన రెండు మెయిడెన్ ఓవర్లు మొహ్సిన్ ఖాతాలోనే ఉండటం విశేషం.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణాను సైతం మొహ్సిన్ ఇలాగే పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. మొహ్సిన్ విసిరిన గుడ్ లెంగ్త్ డెలివరీని లాంగ్-ఆన్ మీదుగా బాదడానికి వైభవ్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి గాల్లోకి లేచింది. కవర్స్ వద్ద ఉన్న దిగ్వేష్ రాఠీ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు మొహ్సిన్ ఖాన్ మళ్లీ ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. దీంతో లక్నోకు ఈ బౌలర్ వల్ల కలిసొచ్చే అంశం ఉంది. 2022లో అరంగేట్రం చేసినప్పుడు 9 మ్యాచ్ల్లో 14 వికెట్లతో చెలరేగిన మొహ్సిన్, ఆ తర్వాత గాయాల బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భుజం సర్జరీ, వెన్ను, కాలి గాయాల వల్ల గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2024లో పునరాగమనం చేసినా మునుపటి పదును కనిపించలేదు. కానీ, ఈ సీజన్లో వైభవ్ వంటి ఫామ్లో ఉన్న బ్యాటర్లను సైతం వణికించి తాను మళ్లీ ఫామ్లోకి వచ్చానని మొహ్సిన్ నిరూపించుకున్నాడు.