Reading Time: 2 minutes
Off The Record About Tdp Vs Janasena In Srikakulam Alliance Tensions Reportedly Growing

Off The Record: శ్రీకాకుళం జిల్లా కూటమిలో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, నేతల మధ్య వివాదాలు బాగా ముదిరిపోతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఇన్నాళ్లు అంతర్గతంగా నడుస్తున్న వార్‌… మెల్లిగా ఓపెనైపోతున్నట్టు అంచనా వేస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే అందుకు సాక్ష్యం అంటున్నారు స్థానికంగా. కార్గిల్ పార్క్, ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డు లైటింగ్ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలకు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్‌కు ఆహ్వానం లేదని మండిపడుతున్నారు జనసైనికులు. ఆ పనులన్నీ శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ నిధులతో చేసినవేనని, అయినాసరే…. సుడా చైర్మన్‌ను పిలవకపోవడం ఏంటన్నది జనసేన నాయకుల ప్రశ్న. మేమంటే అంత లెక్కలేనితనం ఏంటి? అలా తక్కుగా చూస్తారా అంటూ లోలోన రగిలిపోతున్నారట జనసైనికులు. అందుకు కారణం కేవలం కమ్యూనికేషన్ గ్యాపేనని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నా… అంత సీన్‌ లేదు, పక్కాగా ప్లాన్‌ ప్రకారం అవమానించరంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారట జనసేన నాయకులు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా వ్యవహారం తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని , కూటమిలో గ్యాప్ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నది గ్లాస్‌ లీడర్స్‌ వెర్షన్‌. కూటమిలో గొడవలు ఉండకూడదని, వివాదాలు ఎప్పటికప్పుడు సద్దుమణగాలని తాము కోరుకుంటున్నా… జిల్లాకు చెందిన కొందరు బడా నేతలు మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు.

జనసేన తరఫున ఉమ్మడి జిల్లాలో పాలకొండ ఎమ్మెల్యే ఉండివుండొచ్చుగానీ… అసలు పార్టీ భావజాలం నుంచి పుట్టిన నాయకుడు మాత్రం కొరికాన రవికుమారేనన్నది వాళ్ళ మాట. పరిణామాలు మళ్ళీ అనుకూలించి భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనంటూ జరిగితే… ఏదో ఒక నియోజకవర్గం నుంచి రవికుమార్ ఎంపీగా, ఆయన భార్య కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగాగానీ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది పార్టీ టాక్‌. అలాంటి కీలక నేతను విస్మరించడమంటే… జనసేన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నమేనంటూ లోలోపల మధనపడుతున్నారట స్థానిక నాయకులు. ఈ పరిస్థితుల్లో సిక్కోలు కూటమిలో లుకలుకలు పెరిగిపోతున్నాయన్నది పరిశీలకుల మాట. జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియెజకవర్గంలో ఒక్కో తీరుగా ఉంది వ్యవహారం . కరవమంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్టు పాలకొండలో టిడిపి వర్సెస్ జనసేన ఇష్యూ నడుస్తోంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టిడిపి ఇంచార్జ్ పడాల భూదేవి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ విషయంలో ఇరు వర్గాలు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉండగా… అక్కడ బలపడేందుకు జనసేన అగ్రనాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ ముఖ్య నేత నాగబాబు వరుస పర్యటనలతో ఎచ్చెర్ల కూటమి క్యాడర్ అంతా జనసేన వైపు మళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. దీంతో మిగతా రెండు పార్టీల నాయకుల్లో గుబులు మెదలైనట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు రాజాంలో టిడిపి వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది.

ఇలా మెజార్టీనియెజకవర్గాలలో చాపకింద నీరులా జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇచ్చాపురం మెదలు ఎచ్చెర్ల వరకూ కూటమి నాయకుల మధ్య విభేదాలు తరచూ బయటపడుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదంటూ… జిల్లా జనసేన నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారట. అటు పాలకొండలో పరిస్థితిని ఇన్ఛార్జ్‌ పడాల భూదేవి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిసింది. ఇలా ఎవరికి వారు తాము బలహీనంగా ఉన్నచోట పరిస్థితిని పార్టీ పెద్దలకు వివరిస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నార. 15 ఏళ్ళు కలిసే ఉంటామని ఓవైపు అగ్రనేతలంతా ఢంకా బజాయించి చెబుతుంటే… కింది స్థాయిలో మాత్రం గిల్లికజ్జాలతో కాపురం చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదన్న చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో. ఇలాంటి వాటికి ఇప్పుడే చెక్‌ పెట్టకుంటే… మరింత పెరిగి కూటమిలో కుమ్ములాటలుగా ఎక్కువైపోతాయని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అగ్ర నాయకత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.