
ఐపీఎల్ 2026లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో రాజస్తాన్పై గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించి విజయ దుంధిభి మోగించింది. గెలుపు కోసం ఎదురుచూస్తున్న కేకేఆర్ ఎట్టకేలకు విక్టరీ కొట్టింది. రింకూ సింగ్ మరోసారి అద్భుతమైన ఆటతో మ్యాచ్ ఫినిషర్ గా నిరూపించుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్కు ఇదే తొలి విజయం.
Also Read:MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వైభవ్ 46 పరుగుల సహాయంతో రాజస్థాన్, కేకేఆర్కు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, కేకేఆర్ చివరి ఓవర్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, అజింక్య రహానే ఇద్దరూ ఖాతా తెరవడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ 27 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించినా స్టంపౌట్ అయ్యాడు. అంగ్రిష్ రఘువంశీపై జట్టుకు ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ, కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు.
ఆ తర్వాత పావెల్ కూడా 23 పరుగులకే చేతులెత్తేశాడు. ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన యశ్ రాజ్ పుంజా రమన్దీప్ ను 10 పరుగులకే ఔట్ చేసి తొలి వికెట్ తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత రింకు సింగ్, అనుకుల్ రాయ్ బాధ్యత తీసుకుని అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రింకు సింగ్ 34 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేయగా, అనుకుల్ 16 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 29 పరుగులు చేశాడు. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరగా, ముంబై చివరి స్థానానికి పడిపోయింది.
రాజస్థాన్ బ్యాటింగ్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ను వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రారంభించారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో ఓవర్లో జట్టు స్కోరును 50 దాటించారు. తొమ్మిదో ఓవర్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరుణ్ తన స్పిన్తో వైభవ్ను బోల్తా కొట్టించడంతో, 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జూరెల్ను ఔట్ చేశాడు. జూరెల్ 5 పరుగులకే ఔటయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కెప్టెన్ రియాన్ పరాగ్ 12 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటవడంతో నాలుగో వికెట్ను కోల్పోయింది. సునీల్ నరైన్, డోనవన్ ఫెరీరాను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తిక్ త్యాగి, రవీంద్ర జడేజాను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తి త్యాగి బౌలింగ్లో షిమ్రాన్ హెట్మయర్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. కార్తిక్ త్యాగి ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మెయర్, రవి బిష్ణోయ్లను ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.