
Andhra Pradesh Weather Alert: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ–రాయలసీమ–తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ప్రభావం విస్తరించిందని తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఆదివారం, సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడవద్దు. నేడు గరిష్ఠంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C నమోదైంది. 244 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కర్నూలు గూడూరు, నంద్యాల ఆళ్లగడ్డలో 44.3°C, అనంతపురం తెరన్నపల్లిలో 44.1°C, తిరుపతి వరదయ్యపాలెం 43.5°C, మార్కాపురం కొమరోలు 43°C, కాకినాడ కరప, శ్రీసత్యసాయి కొత్తచెరువు 42.9°C, ప్రకాశం కొప్పెరపాడు 42.5°C, పల్నాడు గురజాల 42.3°C, అన్నమయ్య నూలివీడు 41.9°C నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 7 మండలాలు తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలతోపాటు విజయనగరం 7, మన్యం 1, అల్లూరి 2, పోలవరం 7, కాకినాడ 3, తూర్పుగోదావరి 4, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది.