Reading Time: 2 minutes

బాబోయ్.. భర్తను చంపేసి ఏమన్నా యాక్టింగా.. ఆల్ మోస్ట్ నమ్మేశారు.. కానీ ఎలా దొరికిపోయిందంటే..

Caption of Image.

మేఘాలయ హనీమూన్ మర్డర్ గుర్తుండే ఉంటుంది. హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ పక్కా ప్లాన్తో రూ.20 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్త రాజా రఘువంశీని మర్డర్ చేయించింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. దేశంలో అప్పటివరకూ జరిగిన వివాహేతర సంబంధాల హత్యల్లో ఈ హనీమూన్లో హత్య ఎపిసోడ్ హైలైట్ అయింది. ఈ ఉదంతంపై ఓటీటీలో డాక్యుమెంటరీ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇంతకు మించిన ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో వెలుగుచూసింది. రాజా రఘువంశీ హత్య జరిగిన సమయంలో అతని భార్య సోనమ్ కనిపించకుండా పోయి ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయింది. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఘటనలో భర్త శవం ముందే.. భర్తను హత్య చేసిన అదే ఇంట్లోనే కూర్చుని మొసలి కన్నీరు కార్చింది.

ఆమె ఈ ఎపిసోడ్ను ఎంతలా రక్తి కట్టించిందంటే.. ఆమె నటన చూసి ఆమె చెప్పిందంతా నిజమేనని పబ్లిక్తో పాటు పోలీసులు కూడా ఆల్ మోస్ట్ నమ్మేశారు. కానీ.. పోలీసులు ఇలాంటి కేసులను చాలానే చూసుంటారు కదా. బాధితురాలిగా నటిస్తున్న ఈ వివాహితనే నిందితురాలిగా తేల్చారు. భర్తను హత్య చేయించింది భార్యనేనని గుర్తించారు. 36 గంటల్లోపే మర్డర్ మిస్టరీని సాల్వ్ చేశారు. ఈ హత్యకు కూడా భార్య వివాహేతర సంబంధమే కారణం కావడం గమనార్హం. 

ప్రియుడు, ఈ వివాహిత కలిసి పక్కాగా ప్లాన్ చేసి భర్తను చంపేశారు. అయితే.. దోపిడి దొంగలు చేసిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంట్లో దోచుకున్న దొంగలు ఆమె కాళ్లూచేతులు కట్టేసి.. ఆమె భర్తను హత్య చేసినట్టుగా పక్కాగా కథ అల్లేశారు.

ప్రియాంక, దేవకృష్ణ రోహిత్ భార్యాభర్తలు. రోహిత్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని భార్య ఇంట్లో కట్టేసిన స్థితిలో కనిపించింది. ఏం జరిగిందని.. ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులు ఆరా తీస్తే.. కొందరు దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి.. తన భర్తపై దాడి చేశారని.. ఒక గదిలో కట్టేశారని ఆమె చెప్పింది. ఆ తర్వాత తనను కూడా కట్టేసి.. అరిస్తే చంపేస్తామని పీక మీద కత్తి పెట్టారని.. మరొకరు ఇల్లంతా దోచేశాడని.. తన భర్తను అన్యాయంగా చంపేశారని ఆమె కన్నీరుమున్నీరైంది. 

ఏడుస్తూ ఆమె చెప్పిన విధానం, ఆమె భయం, ఆమె కన్నీళ్లు, మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో వణుకు.. అన్నీ చాలా సహజంగా అనిపించాయి. దీంతో.. ఆమెపై ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసులు కూడా దాదాపుగా నమ్మేశారు. కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో పోలీసులు ఆ ఇంట్లో దోపిడి జరిగినట్లుగా అనిపించలేదు. 

దుండగులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. పోలీసులకు ఇంట్లో ఇంకేదో జరిగిందని అనుమానం వచ్చింది. కాల్ వివరాలు, మొబైల్ లొకేషన్లు.. ఇలా సాంకేతిక ఆధారాలను సేకరించి.. కొందరిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. ప్రియాంక అల్లిన కథ వీక్ అయిపోతూ వచ్చింది. 

పోలీసులు ప్రియాంకను విచారించాలని నిర్ణయించారు. ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగానే తన భర్త అడ్డు తొలగించుకునేందుకు సురేంద్ర అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి రోహిత్ను హత్య చేయించినట్లు ప్రియాంక విచారణలో అసలు నిజం బయటపెట్టింది.

©️ VIL Media Pvt Ltd.