
జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ పాడుకుంటూ కళ్లముందే తిరగాల్సిన పదేళ్ల బాలుడు.. అనంత లోకాలకు వెళ్లిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
గ్రామానికి చెందిన తోపారపు చంద్రశేఖర్, నవిత దంపతుల కుమారుడు నిషాంత్. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న నిషాంత్ ఏప్రిల్ 6న తన తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లాడు. అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా ఆ బాలుడికి ఫిట్స్ వచ్చాయి. కుమారుడి పరిస్థితి చూసి కంగారుపడ్డ తల్లిదండ్రులు, వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే నిషాంత్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. వైద్యులు పరీక్షించే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పాయాడు.
చేతికి అందివచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పదేళ్ల వయసులోనే గుండెపోటుతో బాలుడు మృతి చెందడం పొరండ్ల గ్రామంలో విషాద ఛాయలు నింపింది.