Reading Time: < 1 minute
Psl 2026 Empty Stadium Ball Color Change Lahore Match News

Pakistan Super League 2026: పాకిస్థాన్‌ సూపర్ లీగ్ (PSL) 2026 గురువారం లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు, మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ (53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ కింగ్స్‌మెన్ కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఫఖర్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో తెలుపు బంతి కాస్త గులాబీ రంగులోకి మారింది. దీనికి కారణం హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్లు ధరించిన జెర్సీల రంగు బంతికి అంటుకోవడమే అని చెబుతున్నారు. సాధారణంగా బంతిని మెరిపించడానికి ప్లేయర్లు తమ దుస్తులకు రుద్దుతుంటారు. అలా రుద్దినప్పుడు జెర్సీ రంగు బంతికి అంటుకుని అది రంగు మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ ఈ విషయాన్ని గమనించి వెంటనే అంపైర్లకు చెప్పడంతో 15 ఓవర్‌లో బంతిని మార్చారు. ఈ అంశంపై నెటిజన్లు పీఎస్‌ఎల్‌ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. “కనీసం క్వాలిటీ టీ షర్టులు కూడా కొనుక్కోలేని వాళ్లు.. మీకెందుకు రా క్రికెట్‌” అంటూ ఓ నెటిజన్లు ఘాటుగా స్పందించాడు. మొదటి రోజే అందరి ముందు పరువు పోయిందిగా అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశాడు.

READ MORE: Petrol & Diesel Price: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?

మరోవైపు.. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రేక్షకులు లేకుండానే జరుగుతోంది. ESPNcricinfo ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PBC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఇంధన సంక్షోభం కారణంగా తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పౌరులందరినీ కోరారని తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను ఆరు వేదికల నుంచి కేవలం రెండు వేదికలకు కుదించారు. దీంతో ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు లాహోర్, కరాచీలలో జరగనున్నాయి. అంతేకాకుండా, లాహోర్‌లో జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని రద్దు చేశారు. అందుకే జనాలు ఎక్కువగా రావడం లేదని తెలిపారు.