Reading Time: 2 minutes

ఆహార భద్రత ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి. ప్రజలు తాగే పాలు, తినే తిండి భద్రంగా ఉన్నాయా అనే విషయంలో నమ్మకం లేకపోతే, పాలనపట్ల తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. భారతదేశంలో తరచుగా వెలుగులోకి వస్తున్న పాలకల్తీ ఘటనలు, అలాగే నిద్రపోతున్న నియంత్రణ వ్యవస్థ, అమలు కాని ఆహార భద్రత చట్టాలు, ఆహార భద్రతను నిర్ధారించాల్సిన వ్యవస్థ ఇంకా సరైన స్థాయిలో పనిచేయడం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకే వ్యాపారి సరఫరా చేసిన కల్తీ పాలు తాగినందున వందకుపైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. తొమ్మిది మంది తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయారు. చిన్నపిల్లలు సహా పలువురు ఇంకా పదుల సంఖ్యలో వెంటిలేటర్‌పై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన తర్వాత కూడా కల్తీ పదార్థాన్ని గుర్తించడానికి రాష్ట్రం వెలుపల ఉన్న ప్రయోగశాలల నివేదికలు రావాల్సి వచ్చింది. స్థానిక స్థాయిలో తక్షణంగా పరీక్షించే సామర్థ్యం లేకపోవడంవల్ల, ప్రమాదాన్ని ముందుగానే అరికట్టాల్సిన వ్యవస్థ ప్రాణనష్టాల తర్వాత మాత్రమే స్పందించింది.

ఇలాంటి సమయంలో ఆహార భద్రత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై దృష్టి సారించింది. పోషణ -శిక్ష సురక్ష ప్యాకేజ్‌ద్వారా రాష్ట్రంలో మొత్తం ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో బిడ్డకు ప్రోత్సాహకరంగా ప్రసవ సమయంలో రూ. 25,000, ఐదేళ్లపాటు ప్రతి నెల రూ. 1,000 ఆర్థిక సహాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య ఇవ్వాలని ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ, జననాల రేటు తగ్గిపోతే జపాన్, ఇటలీ, దక్షిణకొరియా వంటి దేశాల్లో ఎదురైన జనాభా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక జనాభా ప్రణాళిక అవసరమే అయినప్పటికీ, పాలకల్తీ వంటి తక్షణ ప్రజాఆరోగ్య సమస్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విమర్శకులు అంటున్నారు.

దేశవ్యాప్తంగా కూడా పాలనాణ్యతపై ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిర్వహించిన సర్వేలు, పెద్ద సంఖ్యలో పాల నమూనాలు నాణ్యత ప్రమాణాలను తీరకపోవడం చూపిస్తున్నాయి. పాలలో నీరు కలపడం అత్యంత సాధారణమైన కల్తీ విధానం. దీనివల్ల పాలపోషక విలువ తగ్గిపోవడమే కాకుండా, కలుషిత నీరు వాడితే పురుగుమందులు, భారీ లోహాలు వంటి హానికర పదార్థాలు కూడా చేరే ప్రమాదం ఉంది. కొన్ని నమూనాల్లో డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్, గ్లూకోజ్, ఫార్మలిన్ వంటి పదార్థాలు కూడా కనిపించాయి. ఇవి పాల మందాన్ని పెంచడానికి లేదా నిల్వకాలాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. వైద్య పరిశోధనలు చూపుతున్నట్లుగా, ఇటువంటి కల్తీ పదార్థాలు జీర్ణాశయ సమస్యలు, ఆహార విషబాధ, అవయవాల నష్టం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మునుపటి సర్వేలు పరీక్షించిన నమూనాల్లో దాదాపు 70 శాతం నాణ్యత ప్రమాణాలను తీరలేదని సూచించాయి. అయితే అన్ని నమూనాలు ప్రమాదకరంగా ఉండేవి కావు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిర్వహించిన సమగ్ర జాతీయ సర్వేలో దేశవ్యాప్తంగా 6,432 నమూనాలను పరీక్షించారు. వాటిలో కొద్దిపాటి నమూనాల్లో మాత్రమే హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జెంట్లు, యూరియా వంటి ప్రమాదకర కల్తీలు కనిపించాయి. కానీ దాదాపు 41 శాతం నమూనాలు కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ వంటి ముఖ్య నాణ్యత ప్రమాణాలను తీరలేదని వెల్లడైంది. ఈ సర్వేలో 5.7 శాతం నమూనాల్లో అఫ్లాటాక్సిన్ ఎం1 అవశేషాలు కనిపించాయి. ఇది పశువులకు ఇచ్చే ఆహారంలో కలుషితం కారణంగా పాలలో చేరుతాయి. ఇది డెయిరీ వ్యవసాయం, సరఫరా నిర్వహణలో ఉన్న సమస్యలను సూచిస్తుంది. ఈ వివరాలు పాల భద్రత, పాల నాణ్యత మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను చూపిస్తున్నాయి. భద్రత నాణ్యతను నిర్ధారించడం కేవలం నియంత్రణ సమస్య కాదు, అది కీలకమైన ప్రజాఆరోగ్య బాధ్యత. ప్రభుత్వాలు ఆహార పరీక్షా ప్రయోగశాలలను బలోపేతం చేయాలి, తగిన సంఖ్యలో నిపుణులను నియమించాలి, డెయిరీ సరఫరా వ్యవస్థపై కఠిన పర్యవేక్షణ అమలు చేయాలి.ఈ చర్యలు తీసుకోకపోతే, ప్రతి రోజు కోట్లాది వినియోగదారుల మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. మనము తాగే పాలు నిజంగా భద్రమేనా?

– డా. ఎం. సురేష్ బాబు

-9989988912