
Polala Amavasya 2026 Telugu: లక్ష్మీప్రదమైన, శుభప్రదమైన శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ మాసం చివరిలో వచ్చే అమావాస్యను హిందూ ధర్మంలో ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. ఈ శ్రావణ బహుళ అమావాస్యను వాడుక భాషలో పోలాల అమావాస్య లేదా పోలంబ వ్రతం, లేదా శ్రావణ అమావాస్య అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. 2026వ సంవత్సరంలో ఈ పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలు ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పోలాల అమావాస్య 2026 తేదీ, సమయాలు:
- స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరము శ్రావణ మాసము, దక్షిణాయనం, కృష్ణపక్షము.
- అమావాస్య తిథి ప్రారంభం: సెప్టెంబర్ 10, 2026, గురువారం రోజున, ఉదయం 10:33 నిమిషాలకు.
- అమావాస్య తిథి ముగింపు: సెప్టెంబర్ 11, 2026, శుక్రవారం రోజున, ఉదయం 8:56 నిమిషాల వరకు.
ఈ పూజను ముఖ్యంగా అమావాస్య తిథి ఉన్నప్పుడే చేసుకోవాలి. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకున్నట్లయితే, 2026లో పోలాల అమావాస్యను సెప్టెంబర్ 11, శుక్రవారం రోజున ఆచరించాలి. ఈ రోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి.
పూజ చేసుకోవడానికి శుభ సమయాలు (సెప్టెంబర్ 11, 2026, శుక్రవారం):
మొదటి శుభ సమయం: తెల్లవారుజామున 4:30 నిమిషముల నుంచి ఉదయం 8:25 నిమిషముల వరకు. ఈ సమయంలో పూజను ప్రారంభించుకోవచ్చు.
రెండవ శుభ సమయం: ఉదయం 9:30 నిమిషముల నుంచి ఉదయం 10:35 నిమిషముల వరకు. మొదటి సమయం కుదరని వారు ఈ సమయంలో పూజను చేసుకోవచ్చు.
పోలాల అమావాస్య ప్రాముఖ్యత, ఉద్దేశ్యం:
ఈ వ్రతం వెనుక ప్రధాన ఉద్దేశ్యం సంతానం సంరక్షణ. సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా, స్త్రీలు తమ సౌభాగ్యం (మాంగల్యం, ఐశ్వర్యం) కోసము, వంశాభివృద్ధి కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల కాలం నుండి వస్తున్న ఈ విశ్వాసం ప్రకారం, చాలా కాలం నుంచి సంతానం లేక బాధపడుతున్న స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. ఇది కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని కోరుతూ చేసే ఒక విశిష్టమైన పూజ.
పొలాల అమావాస్య.. సంతాన క్షేమం కోసం తల్లుల పవిత్ర వ్రతం
పొలాల అమావాస్యను సంతాన క్షేమం, పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం తల్లులు భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పొలంబ లేదా పోలేరమ్మ దేవిని శక్తి స్వరూపంగా భావించి ప్రత్యేకంగా పూజిస్తారు.
పొలంబ వ్రతం కథ
పూర్వం ఒక స్త్రీకు పుట్టిన పిల్లలు పదేపదే అనారోగ్యంతో మరణిస్తుండేవారట. దీంతో ఎంతో బాధపడిన ఆమె పొలంబ దేవిని పూర్ణ భక్తితో ఆరాధిస్తూ వ్రతాన్ని ఆచరించిందని కథ. అనంతరం పుట్టిన సంతానం దేవి అనుగ్రహంతో ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో పెరిగిందని నమ్మకం. అందుకే తల్లులు తమ పిల్లలకు ఎలాంటి ఆపదలు రాకుండా, వారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వ్రత విధానం కుటుంబ ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి కొంత మారవచ్చు.
ఎలా పూజిస్తారు?
పొలాల అమావాస్య రోజున పసుపు, కుంకుమలతో అలంకరించిన దేవి మట్టి విగ్రహాన్ని లేదా కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తారు. అనంతరం దేవికి తోరం కట్టి, కుడుములు లేదా ఉండ్రాళ్లు, పండ్లు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పొలంబ దేవి వ్రత కథను భక్తితో చదివి లేదా విని, అనంతరం హారతి ఇస్తారు. పిల్లల ఆరోగ్యం, సంతాన క్షేమం, కుటుంబ సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. పూజ పూర్తయ్యాక వ్రత ప్రసాదాన్ని స్త్రీలు, పిల్లలకు పంచుతారు.
పూజలో జపించే మంత్రాలు
దేవిని స్మరిస్తూ భక్తులు తమ ఆచారం ప్రకారం ఈ మంత్రాలను జపించవచ్చు: “ఓం పోలేరమ్మాయై నమః” అలాగే, “ఓం గౌర్యై నమః” అంటూ అమ్మవారిని భక్తితో స్మరించుకోవచ్చు.
పొలాల అమావాస్య వ్రతం వెనుక ప్రధాన భావం తల్లి తన పిల్లల క్షేమం, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించడం. భక్తి, విశ్వాసంతో చేసే ఈ ఆరాధన కుటుంబంలో శుభం, సంతోషం కలగాలని కోరుకునే ఒక అందమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.
ముఖ్య గమనిక: శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయినప్పటికీ, ఈ రోజు అమావాస్య తిథి ఉండటం వలన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకూడదు. సాధారణ శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజను లేదా పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవచ్చు.
(Disclaimer: ఈ కథనం సంప్రదాయ విశ్వాసాలు, ఆధ్యాత్మిక ఆచారాల ఆధారంగా అందించబడింది. పూజా విధానాలు, సమయాలు ప్రాంతీయ ఆచారాలు, పంచాంగాల ప్రకారం మారవచ్చు. వ్యక్తిగత విశ్వాసాల మేరకు ఆచరించగలరు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)