
Yashasvi Jaiswal 30 Tests and 30 Venues: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బరిలోకి దిగడంతో జైస్వాల్ తన టెస్టు కెరీర్లో 30వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ 30 టెస్టులూ వేర్వేరు వేదికల్లో ఆడటంతో ఓ అరుదైన, వినూత్నమైన రికార్డు అతడి ఖాతాలో చేరింది. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ సరసన జైస్వాల్ చోటు సంపాదించాడు.
భారత క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడిన రికార్డు సంజయ్ మంజ్రేకర్ పేరిట ఉంది. అతడు వరుసగా 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడాడు. సచిన్ టెండూల్కర్ తన తొలి 32 టెస్టులను వేర్వేరు మైదానాల్లో ఆడాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ 30 టెస్టులతో ఈ ప్రత్యేక జాబితాలో నిలిచాడు. జైస్వాల్ 2023లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు కెరీర్లో 30 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. ఆ టెస్టులు వేర్వేరు స్టేడియంలలో ఆడడం విశేషం. ఓ టెస్ట్ ఆడిన మైదానంలో మరలా ఆడకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటనగా నిలిచింది.
యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఆడిన 30 టెస్టుల్లోని 55 ఇన్నింగ్స్లలో 48.70 సగటుతో 2,567 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో రెండు ద్విశతకాలు బాదాడు. గాలే టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ నిరాశపరిచాడు. 32 పరుగులకే పెవిలియన్ చేరాడు. 11వ ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్తో కలిసి సింగిల్ తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. బౌలర్ కేశర నువంతా అడ్డుగా రావడంతో జైస్వాల్ బ్యాలెన్స్ కోల్పోయి జారిపోయాడు. ఈలోగా జైస్వాల్, రాహుల్ ఇద్దరూ ఒకే ఎండ్కు చేరుకున్నారు. రాహుల్ ముందుగా క్రీజులోకి చేరడంతో జైస్వాల్ రనౌట్గా వెనుదిరిగాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్ రనౌట్ కావడం ఇది మూడోసారి. అంతకుముందు 2024లో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. గత ఏడాది వెస్టిండీస్తో ఢిల్లీలో జరిగిన టెస్టులో 175 పరుగులు చేసిన తర్వాత కూడా ఇదే విధంగా రనౌట్ అయ్యాడు.
మరోవైపు గాలే టెస్టులో భారత జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది. దేవదత్ పడిక్కల్ తన టెస్టు కెరీర్లో తొలి సెంచరీ బాదాడు. పడిక్కల్ 134 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పడిక్కల్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 77 పరుగుల వద్ద కండరాల పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా బయటకు వెళ్లాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినా.. రిషభ్ పంత్ చివర్లో పడిక్కల్కు అండగా నిలిచాడు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 288/2 స్కోరుతో బలమైన స్థితిలో నిలిచింది. పడిక్కల్ 131 పరుగులతో, రిషభ్ పంత్ 27 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.