
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎయిర్పోర్టులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మరో మూడు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ముందడుగు వేసింది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్పోర్టులపై టెక్నో ఎకనమిక్ ఫిజిబులిటీ రిపోర్ట్(టీఈఎఫ్ఆర్) సిద్దం చేసింది. ఈ మేరకు త్వరలో భూసేకరణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందుకోసం సైట్ క్లియరెన్సుల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తొలి దశలో ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం రూ.5545 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందుకోసం హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. అందులో ప్రస్తుతం ఈ మూడు ఎయిర్పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది.
అమరావతి, శ్రీకాకుళం, కుప్పంలో ఎయిర్పోర్టులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 4618 ఎకరాలను సేకరించాలని ప్రణాళికలు రూపొందించారు. రూ.4419 కోట్లతో నిర్మించాలనే అంచనాకు వేశారు. వీటిల్లో రూ.1087 కోట్లను రోడ్లు, డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించనున్నారు. ఇక శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. 1185 ఎకరాలను సేకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. తొలి దశలో రూ.392 కోట్లతో అభివృద్ది చేయనున్నారు. ఇందుకోసం హడ్కో నుంచి రూ.237 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఇక కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 1788 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 1300 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. తొలి దశలో రూ.734 కోట్లతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందింది. భూసేకరణ కోసం రూ.198 కోట్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.146.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం హడ్కో నుంచి రూ.313 రుణం తీసుకునేందుకు డీల్ జరిగింది.