Reading Time: < 1 minute
Revanth Reddy Mulugu Hanamkonda Development Projects

CM Revanth Reddy : ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆశీస్సులు తీసుకుని, రూ. వందల కోట్ల వ్యయంతో సిద్ధమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మేడారం వనదేవతల దర్శనం.. ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులు

సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్న రేవంత్ రెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చేయూత పింఛనుదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు చేరుకుని, గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల (హ్యామ్ రోడ్ల) అభివృద్ధికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. దానితో పాటు రూ.868 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ పైలాన్‌తో పాటు, రూ.63.50 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

పరకాలకు వరాల జల్లు.. రూ. 484.42 కోట్లతో భారీ శంకుస్థాపనలు

ములుగు పర్యటన పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. పరకాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ సమగ్ర స్వరూపాన్ని మార్చేలా మొత్తం రూ. 484.42 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పరకాల పట్టణంలో తాగునీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీ రోడ్లు, ఆసుపత్రి భవనం, డిగ్రీ కళాశాల , విద్యుత్ సబ్‌స్టేషన్లతో పాటు సమీప ప్రాంతాలలో ఫోర్ లేన్ రహదారి నిర్మాణం, ఉర్దూ ఘర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ , అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అంతేకాకుండా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సీఎం ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు.