Reading Time: < 1 minute
Former Maoist Leader Devji Inter Exam After 42 Years

Former Maoist leader: మాజీ నక్సలైట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ నలభై రెండేళ్ల తర్వాత మళ్ళీ విద్యార్థిగా మారారు. మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ ఇంటర్ పరీక్ష రాయనున్నారు. కోరుట్లలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కానున్నారు. కోరుట్లలో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో కేసుల వల్ల ఇంటర్ తెలుగు పరీక్షకి హాజరవ్వలేదు. తెలుగు మినహా అన్ని సబ్జెక్ట్స్‌లలో మంచి మార్కులతో పాసయ్యారు. ఇక ఇంటర్ బోర్డ్ ప్రత్యేక అనుమతితో కోరుట్లలో నేడు పరీక్షకు సిద్ధమవుతున్నారు. న్యాయవాద వృత్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. లా కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఇంటర్ కంప్లీట్ చేయాలని, అందుకే పరీక్షకు హాజరవుతున్నట్లు తిప్పిరి తిరుపతి తెలిపారు.

ఇదిలా ఉండగా.. సీపీఐ (మావోయిస్ట్) అగ్ర నేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ముగ్గురు సహచరులతో కలిసి గతేడాది నవంబర్‌లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవ్ జీ లొంగిపోయినట్లు అప్పటి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. హింస తగ్గుతూ, శాంతి ప్రక్రియ బలపడుతుండటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోందని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ అభిప్రాయపడ్డారు. ఇక గతంలో ఓ ఎన్‌కౌంటర్‌లో బసవరాజు మరణించడంతో సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడైన దేవ్ జీని ఆ సంస్థ అగ్ర నాయకుడిగా పరిగణించారు. ఇంతలో ఆయన లొంగిపోయారు.