Reading Time: 2 minutes
Indian Rupee Hits Historic Low 95 31 Dollar Pm Modi Appeal Fuel Gold

Indian Rupee Crash: భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి ఇటీవల నెలల్లో రూపాయి పతనం అయ్యింది. నిజానికి అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం భారత రూపాయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 82 పైసలు క్షీణించి, 95.31 వద్ద రికార్డ్ స్థాయి కనిష్టానికి పడిపోయింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ కరెన్సీని పాతాళానికి నెట్టాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రంప్ నిర్ణయంతో మారిన సీన్..
ఇరాన్ పంపిన తాజా శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ప్రతిపాదన ‘అంగీకారయోగ్యం కాదు’ అని ట్రంప్ ప్రకటించడంతో, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న భయంతో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2.52 శాతం పెరిగి బ్యారెల్‌కు 103.8 డాలర్లకు చేరింది.

ప్రధాని మోడీ ‘పొదుపు’ మంత్రం..
దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనవసరమైన పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవాలని, విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లకుండా బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత అనిశ్చితి ముగిసే వరకు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. వీటితో స్వల్పకాలంలో వృద్ధి మందగించినప్పటికీ, దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇవి తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బలహీనపడిన విదేశీ మారక నిల్వలు
ఒకవైపు డాలర్ ఇండెక్స్ 98.02 పాయింట్లకు చేరుకుని బలపడుతుండగా, మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. భారత విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో సుమారు $7.79 బిలియన్లు తగ్గి, $690.69 బిలియన్లకు పడిపోయాయి. సోమవానం నాడు రికార్డ్ స్థాయిలో రూపాయి పతనంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఈ రోజు సెన్సెక్స్ 1,312 పాయింట్లు పతనమై 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23,815 స్థాయికి పడిపోయింది. కేవలం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,110 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడి 95.50 స్థాయికి చేరే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులు భారత్‌కు భారం కానున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.