Reading Time: < 1 minute
Roja Says Majority Test Should Be In Assembly Backs Vijay And Slams Ap Coalition Government

RK Roja: తిరుపతిలో వైసీపీ నేత ఆర్కే రోజా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బలనిరూపణ గవర్నర్ వద్ద కాకుండా అసెంబ్లీలో జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ముందుగానే బల నిరూపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలంతా సి. జోసెఫ్ విజయ్‌కు మద్దతుగా ఓటు వేశారని, ప్రజా తీర్పును గవర్నర్ గౌరవించాలని రోజా అన్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు లేకుండా కూటమి ప్రభుత్వం గెలవగలదా అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, అభివృద్ధి మోడల్‌ను చూపిస్తూ విజయ్ ప్రజల్లోకి వెళ్లారని రోజా పేర్కొన్నారు. జగన్ ఫోటోలను ఉపయోగిస్తూ ప్రజలకు అభివృద్ధి హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ ప్రసంగ శైలి నుంచి సభల నిర్వహణ వరకు అనేక విషయాల్లో విజయ్ ఆయనను ఫాలో అయ్యారని, అందుకే అంతటి విజయాన్ని సాధించారని వ్యాఖ్యానించారు. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా రోజా తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో లడ్డూ అంశంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.