
YS Jagan: “హలో ఇండియా” అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసమ్మతిని అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను మూయించడానికి పోలీసులు రాజకీయ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, టీడీపీ కూటమి ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలుగుతోందన్నారు.
భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోందని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, మోసాలు, ప్రజా వ్యతిరేక పాలనపై మాట్లాడే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ మద్దతుదారులు, పాత్రికేయులు, సాధారణ పౌరులపై కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయించి, వెంటనే పోలీసులు స్పందిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని జగన్ విమర్శించారు. కోర్టులు పలుమార్లు తప్పుపట్టినా, కక్ష సాధింపుతోనే పలు సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారని తెలిపారు. తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ, కంటెంట్ తొలగించాలని, ఖాతాలను బ్లాక్ చేయాలని లేదా సస్పెండ్ చేయాలని సోషల్ మీడియా సంస్థలకు పోలీసులు నోటీసులు పంపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు జగన్. ఈ చర్యలను వ్యవస్థీకృత సెన్సార్షిప్గా అభివర్ణించారు. ఇక మరోవైపు టీడీపీ అనుబంధ సోషల్ మీడియా వేదికల్లో ప్రతిరోజూ వైసీపీపై విష ప్రచారం, దూషణలు జరుగుతున్నప్పటికీ పోలీసులు స్పందించడం లేదని జగన్ ఆరోపించారు. వైసీపీ తరఫున ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని, ద్వంద్వ ప్రమాణాలతో పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు నెలకొన్నాయని జగన్ అన్నారు. పోలీసు యంత్రాంగం రాజకీయ ఆయుధంగా మారడంతో విమర్శను కూడా నేరంగా పరిగణించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అసమ్మతిని అణచివేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్..
Hello India !!!!!
AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.
Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026