
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ శకం మొదలైంది. అయితే, మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు మరో 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో.. కింగ్ మేకర్గా మారిన కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీఎంకేతో ఉన్న దశాబ్దాల బంధాన్ని తెంచుకుని, విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే నిప్పులు చెరుగుతోంది. కాంగ్రెస్ నేతలను ఏకంగా వెన్నుపోటుదారులు (Backstabbers) అని సంబోధిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నదురై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్కు ఉన్న 5 అసెంబ్లీ సీట్లు కేవలం ఎం.కె. స్టాలిన్ భిక్షేనని ఘాటుగా విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీని బీజేపీ ‘పప్పు’ అని ట్రోల్ చేస్తున్నప్పుడు, ఆయనే తదుపరి ప్రధాని అని మొదటగా ప్రకటించి గౌరవించింది స్టాలినేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని రాష్ట్ర యూనిట్కే వదిలేయడంతో టీఎన్ కాంగ్రెస్ నేతలు రాత్రంతా చర్చలు జరిపి విజయ్కు మద్దతు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఈ సంకీర్ణ ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ పదవులతో పాటు కొన్ని ప్రభుత్వ బోర్డుల ఛైర్మన్ పదవులను డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నేడు అధికారికంగా మద్దతు లేఖ అందజేసిన తర్వాత, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనైయూర్లో విజయ్ను కలవనున్నారు. ఇప్పటికే భావజాల పరంగా బీజేపీతో పొత్తును తోసిపుచ్చిన విజయ్, తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ సూచన మేరకు కాంగ్రెస్ను చేరదీశారు. “కాంగ్రెస్ కోల్పోయిన అధికారాన్ని విజయ్ తిరిగి ఇస్తాడు.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు” అని ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఈ పొత్తుకు పునాదిగా నిలిచాయి. కేవలం కాంగ్రెస్నే కాకుండా, డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ వంటి పార్టీలను కూడా తనవైపు తిప్పుకునేందుకు విజయ్ పావులు కదుపుతున్నారు. ఈ పార్టీలన్నీ కలిస్తే విజయ్ మెజారిటీ మార్కును సులువుగా దాటుతారు.