
తెలంగాణ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ తరహాలోనే రాష్ట్రంలో TG T20 లీగ్ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక లీగ్ లోగోను, హైదరాబాద్లోని పార్క్ హయత్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో పాటు సినీ నటులు వెంకటేష్, శ్రీకాంత్ , క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొని లీగ్కు ఘన స్వాగతం పలికారు.
వచ్చే జూన్, జూలై నెలల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడనుండగా.. ఈ జట్ల యజమానుల కోసం ఏకంగా 40కి పైగా ప్రముఖ కంపెనీలు పోటీ పడుతుండటం విశేషం. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. 94 ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్సీఏ ద్వారా ఇలాంటి లీగ్ రావడం శుభపరిణామన్నారు. ముఖ్యంగా లోకల్ ప్లేయర్స్ను ఐపీఎల్లోకి, అటు సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గల్లీ క్రికెటర్లను ఇంటర్నేషనల్ లెవల్ స్టార్స్గా మార్చేందుకు TG T20 లీగ్ ఒక అద్భుతమైన వేదిక కాబోతోందన్నారు.