
AP Ministers Singapore Tour: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల సింగపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. సుపరిపాలన, ఆధునిక పరిపాలనా విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్) అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్లో అమలవుతున్న సమర్థవంతమైన పాలనా నమూనాలను పరిశీలించి, వాటిని రాష్ట్ర అభివృద్ధికి అన్వయించుకునే దిశగా ఈ పర్యటన ఉపయోగపడనుంది.
Read Also: New Shoes Dispute: కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
ఈ పర్యటనలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యుకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్ పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి అక్కడి తెలుగు సంఘం ఘన స్వాగతం పలికింది. స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు.
సింగపూర్లో ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా సేవల నిర్వహణ వంటి అంశాలను మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. అలాగే World Bankతో పాటు సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందిన సింగపూర్-ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ (SGJIWC) అవగాహన ఒప్పందం కింద శిక్షణ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ToT) కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర పరిపాలనలో కొత్త మార్పులు, ఆధునిక విధానాల అమలు దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.