Gold Loan: భారతదేశంలో మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంట్లో ఉన్న ‘బంగారం’. అత్యవసర సమయంలో నగదు కోసం బంగారం తాకట్టు పెట్టడం సులభమైన మార్గం. అయితే, ఈ ఏప్రిల్ 1 నుండి బంగారంపై ఇచ్చే రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను సవరించింది. ఈ మార్పుల వల్ల సామాన్యులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
1. పెరిగిన లోన్ లిమిట్: గతంలో మీరు బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే, ఆ బంగారం విలువలో కేవలం 75 శాతం మాత్రమే రుణంగా లభించేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు మీ బంగారం విలువలో ఏకంగా 85 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంది. అంటే తక్కువ బంగారం పెట్టి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు.
2. లోన్ మొత్తాన్ని బట్టి మూడు కేటగిరీలు: రుణం తీసుకునే మొత్తాన్ని బట్టి ప్రభుత్వం మూడు రకాల విభజనలు చేసింది. మీ బంగారం విలువలో రూ.2.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంటే విలువలో 85% వరకు రుణం లభిస్తుంది. అలాగే రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకు: బంగారం విలువలో 80% వరకు రుణం పొందవచ్చు. ఇక రూ.5 లక్షల పైన: పాత నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75% మాత్రమే రుణం లభిస్తుంది.
3. మీకు వచ్చే లాభం ఎంత?: ఒక ఉదాహరణతో చూద్దాం. మీ దగ్గర 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఉందనుకుందాం. పాత రూల్ ప్రకారం.. మీకు రూ.3.75 లక్షలు మాత్రమే లోన్ వచ్చేది. కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు అదే బంగారంపై మీకు రూ.4.25 లక్షల వరకు లోన్ వస్తుంది. అంటే నేరుగా మీ చేతికి మరో రూ.50,000 అదనంగా అందుతాయి.
4. బంగారం ధరను బ్యాంకులు ఎలా లెక్కిస్తాయి? : బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మీ బంగారం విలువను రెండు రకాలుగా లెక్కిస్తాయి. గత 30 రోజుల సగటు ధర (Average Value), మునుపటి రోజు ఉన్న మార్కెట్ ధరను బేరీజు వేసి ఫైనల్ రేటును నిర్ణయిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందుతాయి.
5.అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా, ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నా లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా మధ్యతరగతి ప్రజలకు బంగారం ఒక ‘లైఫ్ లైన్’ లాంటిది. ఇప్పుడు మారిన నిబంధనల వల్ల తక్కువ బంగారం ఉన్నా ఎక్కువ రుణం పొందే వీలుండటం నిజంగా శుభవార్తే.





