Reading Time: < 1 minute
Watch Video: చిన్న పొరబాటుకు టపాసుల్లా పేలిన LPG గ్యాస్ సిలిండర్లు.. పేదోడి గూడు ఛిద్రం! వీడియో వైరల్‌

ములుగు, ఏప్రిల్ 13: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అజాగ్రత్త ఒకచోట ప్రాణాల మీదకు తెస్తే.. మరోచోట గ్యాస్ సిలిండర్ పేలుడు సామాన్యుడి గూడును ఛిద్రం చేసింది. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో గ్యాస్ లీకేజీతో నలుగురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. పుల్కల్‌లో సిలిండర్ పేలి రెండు గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో జరిగిన ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. భారత్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సంగమేశ్వర్ నిబంధనలకు విరుద్ధంగా తన ఇంట్లోనే 15 గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ దాటికి ఇంటి పైకప్పు రేకులు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో సంగమేశ్వర్, అతని తల్లి మల్లమ్మ, అన్న కూతురు శ్రీజతో పాటు సహాయకుడు ఆమోస్ తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ పైన ఉన్న వాటర్ ట్యాంక్ పగిలి నీరు పడటంతో మంటలు సద్దుమణిగాయి. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మరోవైపు పుల్కల్‌లో పెను విషాదం నెలకొంది. అవుసలి లక్ష్మణ్ అనే వ్యక్తి తన వృత్తిని చేసుకుంటూ గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కొత్తగా కట్టుకుంటున్న ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో.. ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ధాటికి లక్ష్మణ్ గుడిసెతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నిరుపేద కుటుంబం రోడ్డున పడటంతో స్థానికులు కన్నీరుమున్నీర వుతున్నారు. ఒకేరోజు జిల్లాలో జరిగిన ఈ రెండు ప్రమాదాలు గ్యాస్ వినియోగంలో అజాగ్రత్త వహిస్తే ఎంతటి మూల్యం చెల్లించుకోవాలో హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.