
ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య భారీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైన విషయం తెలిసిందే. దాదాపు రూ.941 కోట్లతో దీనిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. సుమారు 5.50 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉండనుండగా.. కేంద్రం, రాష్ట్రం కలిసి దీనిని నిర్మించేందుకు సిద్దమవుతున్నాయి. కేంద్రం తన వాటా కింద రూ.741 కోట్లు ఇవ్వనుండగా.. తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. డీపీఆర్ కూడా కేంద్రానికి పంపగా.. త్వరలో ఆమోదం లభించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి పనులను మొదలుపెట్టనుంది.
కింద రోడ్డు.. పైన మెట్రో
అయితే ఎల్బీ నగర్-హయత్ నగర్ మధ్య మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్దం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 7.1 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ఉండనుంది. ఈ రెండూ ఒకే మార్గంలో ఉండటంతో నిర్మాణం ఎలా చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే నాగ్ పూర్ తరహాలోనే కింద రోడ్డు.. పైన మెట్రో లైన్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో మెట్రో లైన్ డీపీఆర్లో మార్పులు చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ మూడు లైన్లుగా ఉండనుండగా.. మెట్రో మార్గం రెండు వరుసల్లో ఉండనుంది. ఈ మేరకు అధికారులు డిజైన్ తయారుచేశారు. అయితే దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ వేర్వేరుగా కాకుండా.. డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తే బాగుంటుందని రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది.
ఆరు నెలల్లో పనులు
ఆరు నెలల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్కు టెండర్లను ఆహ్వానించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎలివేటెడ్ కారిడార్ గురించి వివరాలు వెల్లడించారు. ఈ హైవే రాకతో ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గం మధ్యలో అనేక కాలనీలు ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 17న ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా.. కేంద్రం ఆమోదించింది. ఎల్బీనగర్ ప్రాంతంలో ఇప్పుడు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో దీనికి చెక్ పడనుంది.