
Donald Trump: పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది.
“తక్షణమే అమలులోకి వచ్చేలా, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అన్ని నౌకలను దిగ్బంధించే ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం ప్రారంభిస్తుంది,” అని ఆయన అన్నారు. హార్ముజ్ తెరిచి ఉంచుతామన్న హామీలను ఇరాన్ నెలబెట్టుకోలేదని, సముద్రంలో మైన్లు ఉన్నాయన్న భయంతో ఇప్పటికే నౌకల రాకపోకలు తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
ఇస్లామాబాద్ చర్చల్లో ఇరాన్ అధికారులతో పలు అంశాలపై ఒప్పందం కుదిరిందని, అయితే, అణుశక్తిపై ఒప్పందం కుదరలేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్కు ఎప్పటికీ అణ్వాయుదాలు ఉండవని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలోని మైన్లను తొలగిస్తామని, ఇరాన్ ‘‘చట్టవిరుద్ధమైన సుంకాలు’’ చెల్లిస్తున్న నౌకల్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే వారికి బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని హెచ్చరించారు. ఇరాన్ను ప్రపంచదోపిడీదారుగా అభివర్ణించారు. అమెరికా బలగాలను, వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకునే ఏ చర్యకైనా తీవ్ర ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా దెబ్బతిందని, వాయు రక్షణ వ్యవస్థ చాలా వరకు నిర్వీర్యమైందని ట్రంప్ అన్నారు.