
లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ సైనిక దాడులను మరింత తీవ్రం చేసింది. ఈరోజు(ఏప్రిల్ 9) జరిగిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసెమ్ మేనల్లుడు చనిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
హిజ్బుల్లాను దెబ్బతీయడానికి భౌగోళిక సరిహద్దులు ఏవీ లేవని, అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి దాడులు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత. మాపై దాడి చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉత్తర ఇజ్రాయెల్లో నివసించే ప్రజలు క్షేమంగా ఇళ్లకు తిరిగి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. పేజర్ పేలుళ్ల తర్వాత హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదేనని, కేవలం 10 నిమిషాల్లో 100 లక్ష్యాలను కూల్చివేశామని ఆయన చెప్పారు.
Also Read : ఒక్క పని సక్కగా చేయడం చేత కాదు
ఒకవైపు దాడులు జరుగుతుంటే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోయేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్లు శాంతి ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్ మండిపడ్డారు. దింతో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరగాల్సిన శాంతి చర్చల నుంచి ఇరాన్ తప్పుకోవచ్చని తెలుస్తోంది.
ఈ ఆరోపణలపై నెతన్యాహు స్పందిస్తూ.. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో హిజ్బుల్లా లేదని స్పష్టం చేశారు. అందుకే లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. హిజ్బుల్లాను పూర్తిగా బలహీనపరిచే వరకు మా సైన్యం వెనక్కి తగ్గదని ఇజ్రాయెల్ చెబుతుండగా, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అని ఇరాన్ హెచ్చరిస్తోంది.