Reading Time: 2 minutes
Pm Modi And Sonia Gandhi In One Frame Viral Photo From Rajya Sabha Farewell Event

దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార-ప్రతిపక్ష సభ్యులంతా ఒకే చోట చేరారు. ఇందుకు రాష్ట్రపతి భవన్‌ వేదికైంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

సహజంగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అధికారు-ప్రతిపక్ష సభ్యులు కారాలు-మిరియాలు నూరుకుంటారు. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. అలాంటిది బుధవారం రెండు పక్షాలకు చెందిన సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు.

వచ్చే నెలలో కొంత మంది రాజ్యసభ సభ్యులు సభ నుంచి నిష్క్రమించనున్నారు. ఇప్పటికే కొంత మంది పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో వీడ్కోలు సభ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో అందరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎదుట కలిసి ఫొటో దిగారు. ప్రధాని మోడీ పక్కన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూర్చోగా.. ఇక ముందు వరుసలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజ్, అధికార-ప్రతిపక్ష ఎంపీలంతా ఫొటోలో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖర్గే నవ్వులు..
ఇదిలా ఉంటే బుధవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగంలో మల్లిఖార్జున ఖర్గే విసిరిన ఛలోక్తులు నవ్వులు.. పువ్వులు పూయించాయి. దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని.. చాలా కాలం సన్నిహితంగా పని చేసినట్లుగా ఖర్గే గుర్తుచేశారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ మాతో ఉంటుండగానే అధికార పార్టీతో చేతులు కలిపారన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. మాతో డేటింగ్ చేసి.. చివరికి వారిని పెళ్లిని చేసుకున్నారని పంచ్ వేశారు. ఈ డైలాగ్‌తో ప్రధాని మోడీ సహా సహచర ఎంపీలంతా నవ్వుకున్నారు.