Reading Time: < 1 minute
Andhra: భక్తులు లాగుతున్న రథం ఒక్కసారిగా నిలిచిపోయింది.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..?

అనంతపురం జిల్లా ఉరవకొండలోని సుప్రసిద్ధ గవి మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో ప్రాంతమంతా మారుమోగింది. అయితే రథోత్సవం మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారీ రథం సగం దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయింది. భక్తులు ఎంత ప్రయత్నించినా రథం ముందుకు కదల్లేదు. దీంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో గవి మఠానికి చెందిన ఏనుగు ముందుకు వచ్చి రథ చక్రాలను తలతో నెమ్మదిగా నెట్టింది. గజరాజు సహాయంతో రథం మళ్లీ కదలడం ప్రారంభించింది. ఒకవైపు భక్తులు ఓం నమశ్శివాయ నినాదాలతో మారుమోగుతుండగా, మరోవైపు ఏనుగు రథాన్ని నెడుతున్న దృశ్యం భక్తులను భక్తి భావంలో ముంచెత్తింది. మధ్యలో ఆగిపోయిన రథం గజరాజు సాయంతో ముందుకు కదలడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరుదైన ఘటన రథోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.