Reading Time: 2 minutes
Mallikarjun Kharge Reacts To The Arrest Of Congress Youth President Uday Bhanu

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన కేసులో జాతీయ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఉదయ్ భాను‌ చిబ్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం 4:30 గంటలకు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ… ‘‘కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నప్పుడు నితిన్ గడ్కరీ, ఇతర బీజేపీ నాయకులు ఏం చేశారో తెలియదా? ఈ వ్యక్తులు ప్రతి కార్యక్రమానికి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించలేదా? ఆ సమయంలో వారికి జాతీయవాదం గురించి తెలియదా? అప్పుడు జాతీయ భావాల గురించి.. దేశాన్ని ఐక్యంగా ఉంచడం గురించి ఆందోళన చెందలేదా? దేశం నలుమూలల నుంచి వచ్చే అనేక మంది అథ్లెట్లకు ఏ సందేశం పంపించారు? ఇతరులకు నీతులు చెప్పే ప్రయత్నం మానేయండి. ఇతరులకు బోధించడం మానేయండి. ముందు మీరు మారండి. అద్దంలో మీ సొంత ముఖాన్ని చూసుకోండి. అప్పుడు మీ చర్యలు ఏమిటో మీకు తెలుస్తాయి. అందరికీ మీ గురించి తెలుసు. మాకు నేర్పించవద్దు.’’ అని బీజేపీ నేతలకు మల్లిఖార్జన్ ఖర్గే హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Tahawwur Rana: ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం!

ఈనెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ జరిగింది. దీనికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా అనేక దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఆధ్వర్యంలో కొందరు యువకులు సమ్మిట్‌లోకి ప్రవేశించి అర్ధనగ్నంగా ప్రదర్శించారు. అమెరికాతో డీల్ రద్దు చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఉదయ్‌ భానును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్ జెడ్ నుంచి యూత్ కాంగ్రెస్ ప్రేరణ పొందినట్లుగా కోర్టుకు పోలీసులు తెలిపారు.