Reading Time: 2 minutes

మందానా క్లాస్.. రచ్చ లేపిన రిచా.. పాక్ ముందు భారీ టార్గెట్ పెట్టిన భారత్!

Caption of Image.

IND-W vs PAK-W: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన క్లాస్ ఇన్నింగ్స్, చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మాస్ విధ్వంసంతో భారత జట్టు పాక్ ముందు 171 పరుగుల పటిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.

నిరాశపర్చిన షఫాలీ, జెమీమా: 
భారత ఇన్నింగ్స్ అత్యంత డ్రామాటిక్‌గా ప్రారంభమైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (6) ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టి అదిరిపోయే హింట్ ఇచ్చినా.. ఆ మరుసటి బంతికే సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత వన్ డౌన్ వచ్చిన జెమీమా రోడ్రిక్స్ (1) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయింది. దీంతో భారత్ 18 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి స్వల్ప ఒత్తిడిలో పడింది.

మంధాన, హర్మన్‌ప్రీత్ ‘కెప్టెన్సీ’ పార్ట్‌నర్‌షిప్
కష్టాల్లో పడిన జట్టును వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి అద్భుతంగా ఆదుకున్నారు. ముఖ్యంగా స్మృతి మంధాన పాక్ బౌలర్లను ఉతికేస్తూ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 109 పరుగుల వద్ద స్మృతి మంధాన అవుట్ కాగా, ఆ వెంటనే వచ్చిన భారతీ ఫుల్మాలి (1) ఔట్ అయింది. ఆ కాసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36 రన్స్, 35 బంతుల్లో) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

రిచా ఘోష్ రుద్రరూపం: 
మిడిల్ ఆర్డర్ వికెట్లు పడినా.. చివర్లో వచ్చిన రిచా ఘోష్ మైదానంలో పూనకాలు తెప్పించింది. కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేసి పాక్ బౌలింగ్ లైన్అప్‌ను చెల్లాచెదురు చేసింది. దీప్తి శర్మ (12*) తో కలిసి డెత్ ఓవర్లలో స్కోరు బోర్డును పరుగెత్తించింది. ముఖ్యంగా 19వ ఓవర్లో రికార్డు స్థాయిలో పరుగులు పిండుకోవడంతో భారత్ 170 పరుగుల మార్కును అందుకోగలిగింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

 

©️ VIL Media Pvt Ltd.