
India vs Pakistan Women’s T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ (Women T20 World Cup) లో భాగంగా కాసేపట్లో (జూన్ 14) బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియాకు ఈ టోర్నీలో ఇదే మొదటి మ్యాచ్.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ గెలవని ‘ఉమెన్ ఇన్ బ్లూ’ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో టోర్నీని ఘనంగా ప్రారంభించాలని చూస్తోంది.
సెమీస్ చేరాలంటే గెలవాల్సిందే!
ఈసారి టీ20 వరల్డ్ కప్లో మొత్తం 12 జట్లతో రెండు గ్రూపులుగా నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు గ్రూప్–ఏలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లు ఈ గ్రూపులో ఉండటం వల్ల ప్రతి మ్యాచ్ కూడా సెమీఫైనల్ రేసులో ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ నుంచి కేవలం టాప్–2 జట్లు మాత్రమే నాకౌట్ (సెమీస్) కు చేరుకుంటాయి. కాబట్టి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ భారత్కు ఎంతో కీలకం. కాగా, శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై 87 రన్స్ తేడాతో విజయంసాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది.
పిచ్ రిపోర్ట్:
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ పిచ్ సాధారణంగా కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. హిస్టారికల్గా ఇంగ్లాండ్లోని మిగతా మైదానాలతో పోలిస్తే ఇక్కడ స్పిన్నర్లకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. మహిళల టీ20ల్లో ఇక్కడ పడిన మొత్తం 221 వికెట్లలో 115 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే పడగొట్టడం విశేషం. దీనికి తోడు మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం 77 శాతం మబ్బులతో (Cloud cover) కప్పి ఉండనుంది. ఈ కండిషన్స్ వల్ల భారత స్పిన్నర్ రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, నందిని శర్మ వంటి పేసర్లకు పిచ్ నుంచి మంచి హెల్ప్ దొరకనుంది. వీరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
►ALSO READ | విమెన్స్ టీ20 వరల్డ్ కప్: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆసీస్
హెడ్ టు హెడ్ రికార్డులు:
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీ చూసుకుంటే పాకిస్తాన్పై టీమిండియాదే పూర్తి ఆధిక్యం కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 16 మ్యాచుల్లో భారత్ ఏకంగా 13 విజయాలతో టాప్లో ఉండగా.. పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే.. మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడిన మ్యాచుల్లో భారత్ 6 సార్లు విక్టరీ సాధించగా, పాక్ 2 సార్లు గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్ 3 పొజిషన్లో ఉంటే, పాకిస్తాన్ నెంబర్ 8లో కొనసాగుతోంది. కానీ పాక్ సాధించిన 3 విజయాలలో రెండు వరల్డ్ కప్ వేదికలపైనే వచ్చాయి కాబట్టి ఇండియన్ అమ్మాయిలు జాగ్రత్తగా ఆడాల్సి ఉంది.
వాతావరణం ఎలా ఉందంటే:
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ చూసే ఫ్యాన్స్కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బర్మింగ్హామ్లో సగటు ఉష్ణోగ్రత 19°C గా నమోదు కానుండగా, వర్షం పడే అవకాశం కేవలం 9 శాతం మాత్రమే ఉంది. కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ భారత కాలమానం (IST) ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా 3వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 8వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్, రికార్డుల పరంగా చూస్తే పాక్పై భారత్దే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది.