
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రావస్తి జిల్లా బస్భరియా పురైనా గ్రామంలో ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి ఒక పొలంలో ఒక ఆవు గత ఏడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వృత్తాకారంలో చుట్టూ తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ వింత ప్రవర్తన, ఆ తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగింది. ఆవు ప్రవర్తనను చూసిన గ్రామస్థులు దీనిని ఒక దైవ లీలగా లేదా ఒక అద్భుతంగా భావించారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా ఆ గ్రామానికి రావడం మొదలుపెట్టారు. చాలా మంది ఆవును పూజించడం, కొందరు భక్తులు ఆవుతో పాటు ఆ పొలం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించడంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది.
ఈ విషయం కాస్తా జిల్లా యంత్రాంగం మరియు పశువైద్య శాఖ దృష్టికి వెళ్లడంతో, ముఖ్య పశువైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం గ్రామానికి చేరుకుని ఆవును నిశితంగా పరిశీలించింది. వైద్య పరీక్షల అనంతరం అసలు నిజం బయటపడటంతో మూఢనమ్మకాలకు తెరపడింది. ఆవు చూపిస్తున్న ఈ అసాధారణ ప్రవర్తనకు ఎలాంటి దైవిక శక్తులు కారణం కాదని, అది ‘సర్రా’ (హైపోగ్లైసీమియా) అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశువుల మెదడుపై ప్రభావం పడి, అవి మానసిక సమతుల్యతను కోల్పోతాయని, ఫలితంగా ఒకే దిశలో వృత్తాకారంలో తిరగడం వంటి అసాధారణ పనులు చేస్తాయని వివరించారు.
उत्तर प्रदेश के जिला श्रावस्ती में गाय पिछले 8 दिन से एक ही खेत के लगातार चक्कर लगा रही थी। लोगों ने चमत्कार मानकर पूजा–अर्चना शुरू कर दी। गाय की तरह लोगों ने भी खेत की परिक्रमा शुरू कर दी।
अब पता चला है कि गाय को सर्रा (हाईपोग्लाइसीमिया) नामक बीमारी थी। डॉक्टर के इंजेक्शन लगाते… pic.twitter.com/hEDutH00RT
— Sachin Gupta (@Sachingupta) June 13, 2026
వెంటనే స్పందించిన పశువైద్యుల బృందం ఆవుకు తగిన చికిత్సను ప్రారంభించింది. మందులు వాడిన తర్వాత ఆవు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని, త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని వైద్యులు హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామంలో రోజురోజుకూ పెరుగుతున్న జనసందోహాన్ని, శాంతిభద్రతల సమస్యను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ఇది ఒక జబ్బు మాత్రమేనని, మూఢనమ్మకాలను నమ్మవద్దని నచ్చజెప్పి గుంపులను చెదరగొట్టారు. అనంతరం ఆవును దాని యజమానికి అప్పగించి, మళ్లీ అక్కడ ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులను ఆదేశించారు. పశువైద్యుల నివేదికతో అసలు విషయం తెలిసినప్పటికీ.. కొందరు ఇప్పటికీ దీనిని ఒక వింతగానే చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి సాధారణంగా ఉంది.