Reading Time: < 1 minute
Pm Modi Invites Global Investors To India At India Innovates 2026 In France

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మోడీని ఘనంగా స్వాగతించారు. ఇద్దరు నేతలు ‘‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ భారత సాంకేతిక అభివృద్ధి గురించి మాట్లాడారు. భారత్ కేవలం ఒక వినియోగదారు దేశం మాత్రమే కాదని, ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. దశాబ్ధం క్రితం భారత్ కేవలం టెక్నాలజీని స్వీకరించే దేశంగా మాత్రమే ఉండేదని, కానీ నేడు సాంకేతికత అందించే దేశంగా ఆవిర్భవించిందని చెప్పారు. పెట్టుబడిదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ వచ్చి, తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో రూపకల్పన చేయాలని, భారత్‌ను అభివృద్ధి చేయాలని, ప్రపంచం కోసం పరిష్కారాలు సృష్టించండి అని ఆహ్వానించారు.

‘ఇండియా ఇన్నోవేట్స్ 2026’ అనేది దేశంలోని డీప్-టెక్ స్టార్టప్‌లు మరియు పరిశోధనా సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఇదే సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్ మాట్లాడుతూ.. భారత్‌ను ఆవిష్కరణల దేశంగా అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), వాతావరణ మార్పు వంటి కీలక రంగాలలో భారత్, ఫ్రాన్స్‌లకు బలమైన భాగస్వామ్యం ఉందని చెప్పారు. భారతదేశ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఫ్రాన్స్ తోడుగా ఉంటుందని అన్నారు.