Reading Time: 2 minutes
Ktr Slams Revanth Reddy Government Calls First Half A Disaster At Khairatabad Meeting

KTR Comments on Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయిందని, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే అది హిట్టా, ఫట్టా అని అంచనా వేస్తారని.. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చేశారని కేటీఆర్ అన్నారు. ‘ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్‌గా మారింది’ అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. అయితే గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను మాత్రం కూల్చివేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాల విషయంలో కూడా ప్రభుత్వం బకాయిలు పెంచుకుంటూ పోతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లను రాజకీయంగా పక్కన పెట్టాలని కోరుతూ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేదన్నారు. రేవంత్ అవినీతి వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చారని.. ఆ కారణంగానే ఆమెపై పగ పెంచుకుని తప్పుడు కేసులు పెట్టించారన్నారు. మీనాక్షి రాజ్యసభకు వెళ్లే అవకాశాలను కూడా రేవంత్ అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ హయాంలో ప్రారంభించిన రూ.5 భోజన పథకానికి ‘అన్నపూర్ణ’ అనే పేరు పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పేరును తొలగించి ‘ఇందిరమ్మ’గా మార్చిందని కేటీఆర్ విమర్శించారు. అమ్మవారి పేరును కూడా తొలగించారని, అవకాశం దొరికితే జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి పేరును కూడా మార్చేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్‌లో త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న కేటీఆర్.. ప్రతి కార్యకర్త తన డివిజన్‌లో కేసీఆర్ మాదిరిగా పని చేయాలని సూచించారు. ఇతర డివిజన్‌ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.