
Suresh Raina Warns Team India: భారత క్రికెట్ జట్టును కొన్నేళ్లుగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య నమ్మకమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకపోవడమే. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిరంతర గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న వేళ, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని టీమిండియా మాజీ దిగ్గజం సురేష్ రైనా మేనేజ్మెంట్కు ఒక సంచలన హెచ్చరికతో కూడిన కీలక సూచన చేశారు.
వరల్డ్ కప్ వేళ హార్దిక్ గాయాల బెడద.. నిన్న మునిగిన భారత్!
టీమిండియా గడచిన రెండు వన్డే ప్రపంచకప్లలో హార్దిక్ పాండ్యాపైనే అమితమైన నమ్మకం పెట్టుకుని బరిలోకి దిగింది. అయితే, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్, గత 2023 ప్రపంచకప్లోనూ టోర్నీ మధ్యలోనే గాయపడి జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు. కీలక సమయాల్లో ప్రధాన ఆల్రౌండర్ దూరం కావడం వల్ల భారత జట్టు రెండు సార్లు కూడా టైటిల్కు చేరవగా వచ్చి బోల్తా పడింది. 2019లో సెమీఫైనల్లో, 2023లో ఫైనల్లో ఎదురైన పరాజయాలకు ఈ ఫిట్నెస్ సమస్యలు కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
2027 ప్రపంచకప్కు రైనా హెచ్చరిక: రీప్లేస్మెంట్ తప్పనిసరి!
సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2027 అక్టోబర్ 4 నుంచి ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఆఫ్రికా పిచ్లపై ఫాస్ట్ బౌలర్లు, పేస్ ఆల్రౌండర్ల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఇలాంటి తరుణంలో, ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించిన హార్దిక్ పాండ్యా, మళ్లీ ప్రాక్టీస్ సెషన్లో గాయపడి సిరీస్ మొత్తానికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే, హార్దిక్కు సరైన ప్రత్యామ్నాయాన్ని (రీప్లేస్మెంట్ ప్లేయర్) ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని సురేష్ రైనా గట్టిగా హెచ్చరించాడు.
నితీష్ కుమార్ రెడ్డిపై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..
హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్నెస్తో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టుకు తిరుగులేని అస్త్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతని వర్క్లోడ్ను మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలని రైనా సూచించాడు. ఒకవేళ హార్దిక్ అందుబాటులో లేకపోతే జట్టులో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నకు మేనేజ్మెంట్ ఇప్పుడే సమాధానం వెతుక్కోవాలన్నాడు. ప్రస్తుతం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ విభాగంలో ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందని రైనా అభిప్రాయపడ్డాడు.
సీనియర్ల అండతోనే యువ గిల్ సత్తా చాటగలడు..!
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాధాన్యతను కూడా రైనా ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత ప్రపంచకప్లలో రోహిత్, విరాట్ అద్భుతమైన పరుగుల వరద పారించి జట్టును నడిపించారని కొనియాడారు. శుభ్మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు విరాట్, రోహిత్ వంటి సీనియర్ల తోడు, అనుభవం ఎంతో అవసరమని.. ఫిట్నెస్గా ఉంటే ఏ ఆటగాడికైనా వయసు అనేది అస్సలు అడ్డుకాదని రైనా స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..