
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20 ప్రపంచకప్లలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన దిగ్గజాల సరసన చేరింది.
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు మంధనా వెన్నుముకగా నిలిచింది. ఇన్నింగ్స్ 11.2 ఓవర్ వద్ద పాక్ బౌలర్ రామీన్ షమీమ్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని క్రీజ్ వెలుపలికి వచ్చి, ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుతమైన ఇన్-సైడ్ అవుట్ షాట్తో బౌండరీగా మలచి ఆమె తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. మధ్యలో ఒకసారి లైఫ్ లభించినప్పటికీజజ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ చివరి కొన్ని ఓవర్లలో ఆమె బ్యాట్ వేగాన్ని పెంచింది. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్తో 144.74 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
ఈ మెరుపు ఇన్నింగ్స్తో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక యాభై అంతకంటే ఎక్కువ స్కోర్లు (50+ స్కోర్లు) చేసిన టాప్ బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధనా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు కేవలం మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్ పేరిట మాత్రమే ఉండేది.
టీ20 ప్రపంచకప్లలో భారత్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు..
స్మృతి మంధనా: 5 (26 ఇన్నింగ్స్లు), మిథాలీ రాజ్: 5 (23 ఇన్నింగ్స్లు), హర్మన్ప్రీత్ కౌర్: 5 (34 ఇన్నింగ్స్లు), పూనమ్ రౌత్: 3 (15 ఇన్నింగ్స్లు). కేవలం 26 ఇన్నింగ్స్ల్లోనే మంధనా ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగా అవుటైనప్పటికీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తో కలిసి మంధనా ఇన్నింగ్స్ను చక్కదిద్ది జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. ఈ రికార్డు ప్రదర్శనతో మంధనా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన క్లాస్ను నిరూపించుకుంది.