
Women’s T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 16.6 ఓవర్లలో కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ మెగా టోర్నీలో రెండు కీలక పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
స్మృతి మంధాన విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ స్మృతి మంధాన అదిరిపోయే ఆటతీరుతో గట్టి పునాది వేసింది. షఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. మంధాన పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమె కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (36 పరుగులు) బాధ్యతాయుతంగా రాణించగా, చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.
దీప్తి శర్మ ‘ఫైవ్ స్టార్’ మ్యాజిక్.. కుప్పకూలిన పాక్
171 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్కు ఓపెనర్లు మునీబా అలీ (41), గుల్ ఫెరోజా (12) పవర్ప్లేలో వేగంగా ఆడుతూ మంచి భాగస్వామ్యమే అందించారు. ఒక దశలో పాక్ 5 ఓవర్లలో 39/0 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే, స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ బంతిని చేతిలోకి తీసుకున్నాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. గుల్ ఫెరోజాను అవుట్ చేసి దీప్తి భారత్కు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న మునీబా అలీని దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ హిట్తో రన్ అవుట్ చేయడంతో పాక్ పతనం ప్రారంభమైంది.
మిడిల్ ఓవర్లలో మరో స్పిన్నర్ శ్రీ చరణి మూడు వికెట్లతో (3/21) పాక్ను గట్టి దెబ్బ కొట్టగా, షఫాలీ వర్మ కూడా కెప్టెన్ ఫాతిమా సనా (0) వికెట్ పడగొట్టింది. ఆఖర్లో మళ్లీ రంగంలోకి దిగిన దీప్తి శర్మ ఒకే ఓవర్లో అలియా రియాజ్ (18), తస్మియా రుబాబ్ (0)లను అవుట్ చేయడమే కాకుండా.. 17వ ఓవర్ చివరి బంతికి నష్రా సంధును హర్మన్ప్రీత్ కౌర్ చేతికి చిక్కేలా చేసి పాక్ ఇన్నింగ్స్కు తెరదించింది. కేవలం 16.6 ఓవర్లలోనే 106 పరుగులకు పాకిస్తాన్ కథ ముగిసింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు (5/5) పడగొట్టి పాక్ నడుం విరిచింది. టీ20 క్రికెట్లో ఆమెకు ఇది అత్యుత్తమ ప్రదర్శన. బ్యాటింగ్లో స్మృతి మంధాన మెరుపులు, బౌలింగ్లో దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ చిరకాల ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.