
Gautam Gambhir on Nitish Reddy: భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ను టీ20 ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించి వన్డే ఫార్మాట్పై దృష్టి పెట్టేలా చేయడం మంచి నిర్ణయమని చెప్పిన గంభీర్.. హార్దిక్ పాండ్య పూర్తిగా ఫిట్గా మారి 10 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే.. ఇద్దరూ కలిసి భారత ప్లేయింగ్ ఎలెవన్లో ఆడే అవకాశం ఉందని వెల్లడించాడు. క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా హార్దిక్ మే తర్వాత ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు.
50 ఓవర్ల ఫార్మాట్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసే స్థితిలో హార్దిక్ పాండ్య ప్రస్తుతం లేడని బీసీసీఐ సెలెక్టర్లు భావించారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి పేరును గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. హార్దిక్ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి నితీశ్ను కొద ప్లేయింగ్ ఎలెవన్లో ఆడిస్తామని చెప్పాడు. అయితే అందుకు హార్దిక్ పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలిగే ఫిట్నెస్ సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. హార్దిక్ను అంతర్జాతీయ క్రికెట్లోకి ఇప్పుడే తీసుకురావద్దని గౌతీ అభిప్రాయపడ్డాడు. చాలా కాలంగా మ్యాచ్లు ఆడని హార్దిక్ ముందుగా మ్యాచ్ ఫిట్నెస్ సాధించాల్సి ఉందని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో వచ్చే నెల పుదుచ్చేరిలో జరగనున్న ఇండియా-ఏ సిరీస్లో హార్దిక్కు మ్యాచ్ ప్రాక్టీస్ లభించే అవకాశం ఉందని గంభీర్ పేర్కొన్నాడు. ఆ సిరీస్లో అన్నీ సజావుగా సాగితే ఆ తర్వాత టీ20లు, వన్డే జట్టులోకి తిరిగి రావచ్చని వివరించాడు. నితీశ్ను ఆసియా గేమ్స్ టీ20 జట్టు నుంచి తప్పించడం అతడికి మరింతగా క్రికెట్ ఆడే అవకాశం కల్పిస్తుందని చెప్పాడు. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అతడికి ఎక్కువగా గేమ్ టైమ్ లభిస్తుందని పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 సిరీస్లో నితీశ్ బౌలింగ్ ఆకట్టుకుంది. తొలి మ్యాచ్లో బాగా రన్స్ ఇచ్చినా.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా వికెట్లు తీశాడు. రెండో టీ20లో మూడు వికెట్లు తీసిన నితీశ్.. మూడో మ్యాచ్లోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
‘అంతర్జాతీయ క్రికెట్లో ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే అంత మెరుగవుతాడు. ఈ సిరీస్లో నితీశ్ అదే చూపించాడు’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే ఆటగాళ్లు ఎక్కువగా అందుబాటులో లేరని.. అందుకే నితీశ్ భారత్కు ఎంతో కీలకమైన ఆటగాడని చెప్పాడు. 50 ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న వచ్చే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని భారత్కు నితీశ్ లాంటి ఆటగాళ్లు అవసరమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలోనే నితీశ్ కూడా గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు వరుస మ్యాచ్ల్లో బౌలింగ్ చేస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు.