Reading Time: < 1 minute
Anchor Udayabhanu Shocking Incident Fan Sent Gold Mangalsutra

తెలుగు బుల్లితెర చరిత్రలోనే తిరుగులేని గ్లామర్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగారు స్టార్ యాంకర్ ఉదయభాను. ఆ రోజుల్లో ఆమె టీవీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. లక్షలాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. అయితే, ఆ రేంజ్ స్టార్‌డమ్ తెచ్చిన పిచ్చి అభిమానం ఆమెకు ఎన్ని చుక్కలు చూపించిందో తాజాగా పంచుకుంటూ ఉదయభాను బాంబు పేల్చారు. నెల్లూరుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా ఆమెకు ‘బంగారు తాళిబొట్టు’ పంపించి, పెళ్లి చేసుకున్నట్లు లెటర్లు రాయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఇచ్చిన NTV పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఉదయభాను తన పాత రోజుల్లో ఎదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టారు. “ఒకప్పుడు ఫ్యాన్స్ నుంచి వచ్చే లెటర్లు ఎంతో ముచ్చటగా ఉండేవి. సమయం కేటాయించి మరీ రాసేవారు. కానీ నెల్లూరు వైపు నుంచి ఒక అభిమాని చేసిన పని నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అతను నాకు ఏకంగా ఒక ‘బంగారు తాళిబొట్టు’ పార్శిల్ పంపాడు. అంతేకాదు.. రోజూ ఉత్తరాలు రాస్తూ, అందులో ‘నా శ్రీమతి ఉదయభాను’ అంటూ సంబోధించేవాడు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

కేవలం ఉత్తరాలు, తాళిబొట్టుతో ఆగకుండా ఆ అభిమాని చేసిన రచ్చతో ఉదయభాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. “అసలేం జరుగుతోంది? ఎక్కడి నుంచి వస్తున్నాడు? నన్నేం చేస్తాడోనని బయటకు అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేది. ఆ టార్చర్ భరించలేక చివరికి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది” అని ఉదయభాను నాటి సంఘటనను పూసగుచ్చినట్లు వివరించారు. వెండితెర హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉన్న సమయంలో, విపరీతమైన అభిమానం కొన్నిసార్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తుందో చెప్పేందుకు ఉదయభాను పంచుకున్న ఈ ఉదంతమే నిదర్శనం. ప్రస్తుతం ఈ సంచలన నిజం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.