Reading Time: 2 minutes
India Women Beat Japan By 8 Wickets To Reach Asian Games 2026 Semifinal

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు ఘన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషిన్‌లో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. మొదటి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అఫ్గానిస్థాన్‌పై ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటిన శ్రీ చరణి ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. షఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

జపాన్ బ్యాటర్లలో అయాకా కాటో-స్టాఫోర్డ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హరునా ఇవాసకి 10 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివరికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గునాలన్ కమలిని 2 బంతుల్లోనే డకౌట్ అయింది. ఆ తర్వాత భారతి ఫుల్మాలి 6 పరుగులకే పెవిలియన్ చేరింది. అయితే షఫాలీ వర్మ తన ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది.

షఫాలీ కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్స్ తో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ కేవలం 5 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది. జపాన్ నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని 90 బంతులు మిగిలుండగానే ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో భారత్ సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇటీవలే మహిళల ఆసియా కప్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ పతకంపై దృష్టి పెట్టింది.