
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నవారి నుంచి భూములను లాక్కునే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, దీనిపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. తాజాగా శుక్రవారం మంత్రి చీట్చాట్లో కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతం భూముల ఓవర్ ల్యాపింగ్ను వెలికితీసే పనిలోనే ఉన్నామని, ఒక వ్యక్తి తాను నివసిస్తున్న ల్యాండ్ ఎంత, డాక్యుమెంట్లలో ఉన్న భూమి ఎంత, అసలు ఫిజికల్ పొజిషన్ ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు. ఇక, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు కేటీఆర్ చిన్నప్పుడే రెండు ఎకరాల్లో ఇల్లు ఉండేదని చెబుతున్నారని, మరి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అఫిడవిట్లో ఆ వివరాలు ఎందుకు పెట్టలేదని పొంగులేటి ప్రశ్నించారు. మొదట గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల లెక్క తేల్చి, ఆ తర్వాతే పక్కన ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇస్తామన్నారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అసైన్డ్ ల్యాండ్ ఉండాల్సినంత అక్కడ లేదని, అది కేసీఆర్ కబ్జాలోనే ఉందనే సమాచారం రావడంతోనే ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లాగే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ విషయంలో కూడా జరిగిందనే అనుమానంతోనే విచారణతో పాటు సర్వే కూడా చేపడుతున్నామని స్పష్టం చేశారు. పూర్వంలో దళితులు వస్తే పసుపు నీళ్లు చల్లిన వారు ఈరోజు దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, వారి నైజం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. చట్ట ప్రకారం దళితుల ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూనే, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గత పాలకులు అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్మును కొల్లగొట్టారని, బినామీల పేరుతో వేల ఎకరాలు వారికి ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిలదీశారు. వట్టి నాగుల పల్లె భూమి తనది కాదని, అది కేవలం డెవలప్మెంట్ కోసమే చేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే హరీష్ రావుకు ఫార్మ్ హౌస్ ఉందని ఆయనే అఫిడవిట్లో పెట్టారని, అందులో చూపించిన 13 ఎకరాలు ఎక్కడివి, ఎవరివి అని ప్రశ్నిస్తూ హరీష్ రావు అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు తెలివిగా భూములను ‘ఆన్ డివైడెడ్ ట్రస్ట్’ అని పెట్టి తీసుకున్నారని, కానీ రంగనాయక సాగర్ భూమిని మాత్రం తన పేరు మీద పెట్టుకున్నారని బయటపెట్టారు. ముఖ్యమంత్రి గానీ, తాను గానీ ఏది మాట్లాడినా బేస్లెస్ (ఆధారాలు లేకుండా) మాట్లాడమని, అన్నింటికీ స్పష్టమైన డాక్యుమెంట్లు ఉన్నాయని తేల్చిచెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, చివరికి తాను తప్పు చేసినా తప్పేనని వ్యాఖ్యానించారు.
కోనాపూర్లో భూములు పోతే హరీష్ రావుకు పరిహారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని, అసలు నూనుగు మీసాల వయస్సు ఉన్నవారికి 42 ఎకరాల భూమి ఎలా వచ్చిందో వెల్లడించాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. తాత గిఫ్ట్ ఇచ్చాడని చెబుతున్నారని, అలాంటి భారీ గిఫ్ట్లు ఇవ్వడం వారి కుటుంబానికే దక్కిందని ఎద్దేవా చేశారు. వారు అఫిడవిట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టే, తాము కూడా దానిపైనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్లోని 118 జీవో ఇబ్బందులపై ఈరోజే కమిటీ వేయనున్నట్లు ప్రభుత్వం తరఫున వెల్లడించారు. ఎక్స్ ఆర్మీ అధికారి నుంచి హరీష్ మామ భూమి కొన్నారనేది పూర్తిగా తప్పు అని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడా లేవన్నారు. రంగనాయక సాగర్లో హరీష్ ఆస్తి వ్యవహారంపై స్పందిస్తూ… ఇరిగేషన్ శాఖ, FTL, బఫర్ జోన్ కలిపి ఎంత భూమి కావాలో కలెక్టర్ను అడిగి, ఆ తర్వాత మళ్లీ రెవెన్యూ వాళ్లతో దాన్ని డిలీట్ చేయించారన్నారు. అలా ల్యాండ్ పొందిన తర్వాత కేవలం రూ. 2 లక్షల 20 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఆ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి అసలు భూమి అడగడం ఎందుకు, మళ్లీ దాన్ని రద్దు చేయించి వెనక్కి తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. రైతుల నుంచి భూమిని తక్కువ రేటుకే కొని, 8 నుంచి 10 మీటర్ల ఎత్తు లేపి, ఆ గుట్ట చుట్టూ రూ. 5 కోట్లు పెట్టి రోడ్డు వేసుకున్నారని విమర్శించారు.