
ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీపం-2 పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలంరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ముందుగా లబ్దిదారుడు సిలిండర్ బుక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ప్రభుత్వం రాయితీ నిధులను లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాల్లో కొన్ని రోజులకు జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయో తెలియక లబ్దిదారులు సతమతమవుతున్నారు. వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో నిధుల జమకు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై పౌరసరఫరాలశాఖ అధికారులు చర్చిస్తున్నారు.
లబ్దిదారుడుకి గ్యాస్ డెలివరీ అయిన తర్వాత నెలలో నిర్ణీత తేదీకి డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఒకవేళ సెప్టెంబర్ నెలలో గ్యాస్ తీసుకుంటే అక్టోబర్లో నిర్ణీత తేదీలో నిధులు జమ అవుతాయి. దీంతో ఆ తేదీన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే డబ్బులు పడ్డాయో.. లేదో తెలుస్తుంది. ఇందుకోసం ఎప్పుడు పడతాయనేది రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పని ఉండదు. ఏ తేదీన అకౌంట్లో పడతాయనేది ప్రభుత్వం ముందుగానే డేట్ ఫిక్స్ చేస్తుంది. దీంతో ఆ రోజు అకౌంట్లో పడతాయి. లబ్దిదారులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన బాధ తప్పుతుంది. ప్రస్తుతం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల డబ్బులు అకౌంట్లో ఎప్పుడు వేస్తారనేది ముందు చెబుతున్నారు. అదే విధానాన్ని ఇప్పుడు దీపం-2 పథకానికి కూడా అమలు చేయనున్నారు. దీని వల్ల లబ్దిదారులకు ముందే ఒక క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం ఏడాదికి మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పంపిణీ చేస్తోంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఒకటి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మరొకటి, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒక సిలిండర్ చొప్పున ఇస్తోంది. 2024 అక్టోబర్ 31న ఈ స్కీమ్ ప్రారంభమైంది. రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. అయితే ఇక కొంతమంది లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటంతో.. ఎందులో పడతాయనేది అర్థం కావడం లేదు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం.. ముందుగా ఫిక్స్ చేసిన తేదీ ప్రకారం డబ్బులు వేయనుంది. దీంతో లబ్దిదారులు చెక్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది.