
Umar Khalid Documentary: ఢిల్లీ గొడవల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హక్కుల కార్యకర్త ఉమర్ ఖాలిద్పై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు లలిత్ వచానీ తెరకెక్కించిన “ప్రిజనర్ నంబర్ 626710 ఈజ్ ప్రెజెంట్” అనే డాక్యుమెంటరీని హైదరాబాద్లోని ఐఐఐటీ (IIIT-H) క్యాంపస్లో ఉన్న కేఆర్బీ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి ప్రదర్శించడానికి కొందరు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి లేని ఏ చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమవుతుందని సెన్సార్ బోర్డు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకవేళ ప్రదర్శించాలనుకుంటే చట్టప్రకారం ప్రత్యేక మినహాయింపు పొందాల్సి ఉంటుందని తేల్చిచెప్పిన సీబీఎఫ్సీ, ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఐఐఐటీ యాజమాన్యాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఆదేశించింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సీబీఎఫ్సీ హెచ్చరికల నేపథ్యంలో ఐఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం త్వరితగతిన స్పందించి, ఆ ప్రదర్శనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. తమ సంస్థ కానీ, తమ గుర్తించిన విద్యార్థి సంఘాలు కానీ సెన్సార్ సర్టిఫికేషన్ లేని ఎలాంటి చిత్రాన్ని ప్రదర్శించడం లేదని వివరణ ఇచ్చింది. క్యాంపస్లో అధికారికంగా ఏవైనా కార్యక్రమాలు నిర్వహించడానికి కొన్ని నిర్దిష్టమైన నియమావళి ఉందన్న యాజమాన్యం, సంస్థతో సంబంధం లేని లేదా అనధికారిక కార్యకలాపాలను తమకు ఆపాదించడం వాస్తవ దూరం అని స్పష్టం చేసింది. తమ క్యాంపస్లో విభిన్న నేపథ్యాలు ఉన్న విద్యార్థులు ఉంటారని, వారు వ్యక్తిగత హోదాలో ఎవరినైనా కలవడం లేదా పరస్పరం చర్చించుకోవడం లాంటివి చేయవచ్చని, అంతమాత్రాన అవన్నీ ఇన్స్టిట్యూట్ అధికారికంగా నిర్వహించినట్లు కాదని వివరించింది. సీబీఎఫ్సీ హెచ్చరికలు, ఇన్స్టిట్యూట్ స్పష్టతతో విద్యార్థుల బృందం ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఈ డాక్యుమెంటరీ చుట్టూ వివాదాలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితమే బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) లో కూడా సెప్టెంబర్ 14న ‘పొలిటికల్ ప్రిజనర్స్ డే’ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉమర్ ఖాలిద్ అరెస్ట్ అయి ఆరేళ్లు పూర్తవుతున్న వేళ లా అండ్ సొసైటీ కమిటీ దీనిని నిర్వహించాలనుకుంది. అయితే, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ (ABVP) దీనిని తీవ్రంగా నిరసించింది. విద్యాసంస్థల క్యాంపస్లను రాజకీయం చేయడానికి, అనవసరమైన ప్రచారాలకు వేదికలుగా వాడుతున్నారంటూ మండిపడింది. తీవ్ర నిరసనల మధ్య భద్రతా కారణాలు, ఇతర లాజిస్టిక్స్ ఇబ్బందులను ఉటంకిస్తూ విద్యార్థి కమిటీ ఆ ప్రదర్శనను వాయిదా వేసింది. అయితే, ఒత్తిళ్లకు లొంగి తాము వెనక్కి తగ్గడం లేదని, త్వరలోనే దీనిని ప్రదర్శిస్తామని కూడా ఆ విద్యార్థి కమిటీ ప్రకటించింది.