
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం ప్రారంభించి కాళ్లపై నిలబడాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు వారి ఆశలపై నీళ్లు చల్లుతుంటాయి. అలాంటి వారికి బాసటగా నిలిచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తున్న ఈ ‘పీఎం విశ్వకర్మ యోజన’ ఇటీవలే విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారు, శిల్పులు తమ సొంత ఉపాధిని ప్రారంభించడానికి వీలుగా ప్రధాని మోడీ 2023 సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో రాజమిస్త్రీలు, కార్పెంటర్లు, పడవలు తయారుచేసేవారు, కమ్మరులు, తాళాలు తయారుచేసేవారు, కుమ్మరులు, శిల్పులు, చేపల వలలు కుట్టేవారు, బొమ్మలు తయారుచేసేవారు సహా మొత్తం 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారిని చేర్చారు.
ఈ పథకం కింద ప్రభుత్వం అందించే రూ.3 లక్షల రుణాన్ని రెండు దశల్లో అందజేస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి మొదటి విడతగా రూ.1 లక్ష, దాన్ని మరింత విస్తరించుకోవడానికి రెండో విడతగా రూ.2 లక్షల రుణం ఇస్తారు. అతి తక్కువగా కేవలం 5 శాతం వడ్డీ రేటుకే లభించే ఈ లోన్ పొందడానికి ఎలాంటి ఆస్తులను గ్యారెంటీగా కుదువ పెట్టాల్సిన అవసరం లేకపోవడం అతిపెద్ద విశేషం. కేవలం రుణ సాయమే కాకుండా, ఎంపిక చేసిన 18 వృత్తుల వారికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కూడా ఇప్పిస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్టైపెండ్ అందించడమే కాకుండా, రూ.15,000 విలువైన టూల్కిట్ గ్రాంట్ను కూడా అందజేస్తారు. అలాగే లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడీ కార్డ్తో పాటు బేసిక్, అడ్వాన్స్డ్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తారు.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పేర్కొన్న 18 వృత్తులలో ఏదో ఒకదానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ప్రమాణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, గురింపు కార్డు, నివాస ప్రమాణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్, పనిచేసే మొబైల్ నంబర్ అవసరమవుతాయి. అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ (pmvishwakarma.gov.in) సందర్శించి, హోమ్పేజీలోని ‘PM Vishwakarma Kaushal Samman Yojana’ విభాగంలో ‘Apply Online’ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న మొబైల్ నంబర్కు వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్లతో లాగిన్ అయి, ఫారమ్ను వివరంగా నింపి, అవసరమైన పత్రాలను జత చేసి సబ్మిట్ చేయాలి. ఈ పథకం ప్రారంభమైన మూడేళ్లలో ఇప్పటివరకు 30 లక్షలకు పైగా మంది నమోదు చేసుకోగా, దాదాపు 24.50 లక్షల మంది విశ్వకర్మలకు స్కిల్ ట్రైనింగ్ పూర్తయింది. అంతేకాకుండా, ఆర్టిజన్లు తమ పనితనం, ఉత్పాదకతను పెంచుకోవడానికి వీలుగా ఇండియా పోస్ట్ ద్వారా ఏకంగా రూ.18.15 లక్షల ఆధునిక టూల్కిట్లను నేరుగా వారి ఇళ్లకే ప్రభుత్వం సగర్వంగా అందజేసింది.