Reading Time: < 1 minute

క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆస్పత్రి

Caption of Image.
  •     స్థలాలను పరిశీలించిన కలెక్టర్, సింగరేణి జీఎం, ఆఫీసర్లు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు ముందడుగు పడింది. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి క్యాతనపల్లి మున్సిపాలిటీలో కొత్త ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గురువారం కలెక్టర్​కుమార్​దీపక్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, తహసీల్దార్​సతీశ్​కుమార్​శర్మ, క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్​మురళీకృష్ణ, సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్లు పరిశీలించారు. రామకృష్ణాపూర్​రాజీవ్​చౌక్​లోని సింగరేణి డిస్పెన్సరీ, పక్కనున్న బ్యాంకు ప్రాంతం, సింగరేణి ఏరియా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో స్థలాల లభ్యతపై ఆరా తీశారు. సుమారు 50 పడకల ఆస్పత్రి నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. ఎకరం స్థలం అవసముంటుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. 

సింగరేణి ఏరియా ఆస్పత్రి పరిశీలన

అనంతరం కలెక్టర్, జీఎం సింగరేణి ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్​ఆదేశించారు. మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) అశోక్​, సింగరేణి ఎస్టేట్​ ఆఫీసర్​నవనీత తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.