
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో డ్యాన్స్ లు, ఎందరో తారలకు, యువ కొరియోగ్రాఫర్లకు స్ఫూర్తిగా నిలిచిన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ యాంకర్ ఉదయభాను, రాకేష్ మాస్టర్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తను మొదట నమ్మలేదని ఉదయభాను తెలిపారు. గతంలోనూ ఇలాంటి వార్తలు రావడంతో లైట్ తీసుకున్నానని, అయితే వార్త నిజమని తెలియగానే తీవ్రంగా బాధపడినట్లు చెప్పారు. తన కెరీర్ ప్రారంభ దశలో “హోరాహోరీ” అనే డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా రాకేష్ మాస్టర్తో పరిచయం ఏర్పడిందని ఉదయభాను వివరించారు. డ్యాన్స్ గురించి పెద్దగా అవగాహన లేని తనకు, నువ్వు ఈ స్టెప్ చేయగలవు అంటూ ఆయన ఎంతో ధైర్యాన్నిచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య అనుబంధం మొదలైందని ఆమె అన్నారు.
రాకేష్ మాస్టర్ కేవలం ఒక డ్యాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు అని ఉదయభాను అన్నారు. ప్రభుదేవా, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి నేటితరం స్టార్ కొరియోగ్రాఫర్లకు ఆయన గురువుగా వ్యవహరించారు. వారిని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు. ఒక ఆర్టిస్ట్ చేత తను అనుకున్న విధంగా డ్యాన్స్ చేయించగల సమర్థత రాకేష్ మాస్టర్కు ఉందని, ఆయన గురువుగా ఉన్నప్పుడు నూరు శాతం విజయం సాధించిన వ్యక్తి అని ఉదయభాను అన్నారు. అయితే, ఆయన జీవితంలో తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల ఆయన జీవితం పూర్తిగా మారిపోయిందని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రాకేష్ మాస్టర్, చివరి దశలో ఇండస్ట్రీకి, తనవారికి దూరం కావడం బాధాకరమని అన్నారు. అయినప్పటికీ, తను ఇటీవల రాకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక పాటలో నటించానని, ఆ సమయంలో ఆయన పూర్తి ఎనర్జీతో, పాత రాకేష్ మాస్టర్గానే కనిపించారని ఉదయభాను చెప్పారు. తెరపై తను అనుకున్నది వచ్చే వరకు నిద్రపోని పర్ఫెక్ట్ మాస్టర్ ఆయన అని చెప్పుకొచ్చారు.
రాకేష్ మాస్టర్ మరణం తర్వాత, ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియోలు తనను ఎంతో బాధించాయని ఉదయభాను పేర్కొన్నారు. రాకేష్ మాస్టర్ ఎంతోమంది అనాధలకు, పేదలకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. నేను ఎంతోమందికి అన్నం పెట్టాను, కానీ ఇప్పుడు నాకు అన్నం పెట్టేవాళ్లు లేరు అని ఆయన పదేపదే చెప్పే మాటలు తనను కలచివేశాయని అన్నారు. ఒకప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా చూడలో తెలిసిన వ్యక్తిగా తనకు రాకేష్ మాస్టర్ గుర్తు అని, తన విషయంలో ఆయన ఎప్పుడూ మంచిగానే ఉన్నారని ఉదయభాను స్పష్టం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, రాకేష్ మాస్టర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..