
CM Chandrababu: విశాఖలోని పేదలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను సాకారం చేసేందుకు రేపు విశాఖపట్నం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, హక్కు పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పూర్తి హక్కులు కల్పించేలా ఈ భూముల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు సీఎం తెలిపారు. మొత్తం 11 మండలాల్లో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కేవలం పట్టాల పంపిణీ మాత్రమే కాదని, దశాబ్దాలుగా హక్కుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది కీలక ఘట్టమని చంద్రబాబు పేర్కొన్నారు. పట్టా పొందిన ప్రతి కుటుంబానికి విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపద లభిస్తుందని ఆయన అన్నారు. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తూనే సామాన్య ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పేద కుటుంబాలకు సొంత స్థలంపై చట్టబద్ధమైన హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 19న విశాఖలో జరిగే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు..
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా… pic.twitter.com/487Mw5szq2
— N Chandrababu Naidu (@ncbn) September 18, 2026