Reading Time: 2 minutes
Hyderabad Gold Ganesh Idol 24k Gold Plating With 383800 American Diamonds

Hyderabad Gold Ganesh Idol: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ బేగం బజార్‌లోని ‘లిచీ పెరల్‌ సెట్‌ జ్యువెలర్స్‌’లో ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గణపతిని 24 క్యారెట్ల గోల్డ్‌ ప్లేటింగ్‌తో పాటు ఏకంగా 3,83,800 అమెరికన్‌ డైమండ్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు.

లిచీ పెరల్‌ సెట్‌ జ్యువెలర్స్‌లో వినాయకుడిని ప్రతిష్ఠించడం ఇది మూడో ఏడాది. ఈసారి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఆలోచనతో ఈ అద్భుతమైన గణపతి విగ్రహాన్ని రూపొందించినట్లు సంస్థ నిర్వాహకుడు అధర్‌ అగర్వాల్‌ తెలిపారు. గణేశుడి ఆశీస్సులతోనే ఇంత అందమైన విగ్రహాన్ని తయారు చేయగలిగామని ఆయన అంటున్నారు.

ఈ విగ్రహాన్ని ఇత్తడితో పాటు మొత్తం ఐదు రకాల లోహాలను ఉపయోగించి రూపొందించారు. వెనుక భాగంలోని మకరతోరణంలో దశావతారాల రూపాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. మకరతోరణం పైభాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపాన్ని, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి ప్రతిమలను అందంగా తీర్చిదిద్దారు. దీనితో ఆ విగ్రహం చూడడానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి.

ఈ గణపతి విగ్రహానికి ప్రధాన ఆకర్షణ ముఖ్య కారణం.. ఇందులో ఏకంగా 3,83,800 అమెరికన్‌ డైమండ్లు పొందుపరిచారు. సాధారణంగా తమ ఫ్యాషన్‌ జ్యువెలరీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలనే ఈ విగ్రహంలోనూ వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో గణపతికి ప్రత్యేకమైన జ్యువెలరీ లుక్‌ వచ్చింది. విగ్రహాన్ని తయారు చేయడం వెనుక ఎంతోమంది కళాకారుల శ్రమ ఉంది. కార్డ్‌ డిజైనర్లు, కాస్టింగ్‌ నిపుణులు, స్టోన్‌ సెట్టర్లు, పాలిషింగ్‌ వర్కర్లతో కూడిన ప్రత్యేక బృందం సుమారు 8 నెలల పాటు రాత్రింబవళ్లు పనిచేసింది. ఒక్కో డైమండ్‌ను చేతితో అమర్చుతూ విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లు అగర్వాల్‌ తెలిపారు.

ఈ విగ్రహం బేస్‌ డిజైన్‌ను ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌ కా రాజా రూపురేఖల స్ఫూర్తితో రూపొందించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో పుట్టి పెరిగిన తమకు చిన్నతనం నుంచే గణేష్‌ ఉత్సవాలతో ప్రత్యేక అనుబంధం ఉందని అగర్వాల్‌ చెప్పుకొచ్చారు. పాతబస్తీలో గణేష్‌ ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్నతనం నుంచే గణపతి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే కోరిక ఉండేదని ఆయన చెప్పారు. ఈసారి ఆ అవకాశం లభించడంతో ఇంత ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. 24 క్యారెట్ల బంగారు మెరుపు, లక్షలాది అమెరికన్‌ డైమండ్ల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ జ్యువెలరీ గణపయ్యను దర్శించుకునేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.