
Mohsin Naqvi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. వరుస పరాజయాలు, జట్లలో నిరంతరం జరుగుతున్న మార్పులపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వహబ్ రియాజ్, ఆకిబ్ జావెద్లపై వేటు వేయడానికి బోర్డు పావులు కదుపుతోంది.
ఆకిబ్ జావెద్, వహబ్ రియాజ్లకు ఉద్వాసన?
పాకిస్థాన్ క్రికెట్లో కీలక నిర్ణయాల వెనుక ప్రధాన వ్యక్తిగా ఉన్న సీనియర్ సెలక్టర్ ఆకిబ్ జావెద్ను ఆ పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా పీసీబీ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో పాటు, ఇంగ్లండ్ పర్యటన సమయంలో జట్టులో చేసిన మార్పులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అలాగే ఆసియా క్రీడల అనంతరం మహిళా జాతీయ జట్టు మెంటార్గా ఉన్న వహబ్ రియాజ్ను కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ క్రికెట్లో వరుస ఓటములకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని నక్వీ భావిస్తున్నారు.
టెస్ట్ బాధ్యతలు మైక్ హెస్సన్ ?
పరిమిత ఓవర్ల జట్టు ప్రధాన కోచ్గా ఉన్న మైక్ హెస్సన్.. త్వరలో టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా చేపట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కూడా పీసీబీ తీసుకునే ప్రక్షాళన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో పాకిస్థాన్ జట్టు 3-0 తేడాతో వైట్వాష్కు గురైంది. లీడ్స్, లార్డ్స్ మ్యాచ్లలో ఘోర పరాజయాలు చవిచూడటంతో బోర్డులో కలకలం రేగింది. సిరీస్ మధ్యలోనే కొందరిని స్వదేశానికి రప్పించడం, కోచింగ్ సిబ్బందిని మార్చడం వంటి పరిణామాలు జరిగాయి.
వివాదాల నడుమ పీసీబీ చైర్మన్ ప్రయాణం
మరోవైపు పాకిస్థాన్ హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న మొహ్సిన్ నఖ్వీ మహిళా ఆసియా కప్ ఫైనల్ కోసం దుబాయ్లో ఉన్న సమయంలో కొన్ని ప్రోటోకాల్ వివాదాలు కూడా తలెత్తాయి. గతంలో పురుషుల ఆసియా కప్ సందర్భంగా భారత జట్టు ట్రోఫీ తీసుకోకపోవడం, తాజాగా మళ్లీ అదే తరహా పరిణామాలు చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పాక్ క్రికెట్ ప్రక్షాళనే లక్ష్యంగా నఖ్వీ తీసుకోబోయే రాబోయే పెద్ద నిర్ణయాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..