Reading Time: < 1 minute
Kangana Ranaut Strongly Responds To Rakhi Sawants Controversial Podcast Remarks

Kangana vs Rakhi Sawant: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ మధ్య ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్ టాక్ షో కారణంగా ఘాటైన మాటల యుద్ధం చెలరేగింది. ఇటీవల ‘ఎమ్‌కే టాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, మహిళా రాజకీయ నాయకురాళ్లైన కంగనా రనౌత్, స్మృతి ఇరానీల పొలిటికల్ జర్నీపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు మోదీజీకి ఏమి ఇచ్చి మంత్రి పదవులు, అవకాశాలు పొందారో, తానూ అవన్నీ ఇవ్వగలనంటూ రాఖీ చేసిన చౌకబారు కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి.

రాఖీ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సమాజంలో ఏ రంగంలోనూ సక్సెస్ కాలేక, నిరాశతో బతికే కొంతమంది వ్యక్తులు.. కష్టపడి పైకొచ్చిన మహిళల క్యారెక్టర్‌ను బలి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మండిపడ్డారు. వాళ్ళ అసూయ, ఈగోలను శాంతింపజేసుకోవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తారని, ఇకపై మహిళలు ఎవరూ ఇలాంటి దాడులకు లొంగిపోవాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు.

ఇంతటితో ఆగకుండా రాఖీ సావంత్‌ను ఉద్దేశించి కంగనా తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు సక్సెస్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతావేమో కానీ, నీ దగ్గర నుండి ఎవరికీ ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎన్ని ఫేవర్లు చేసినా, నీకున్న క్వాలిటీకి నీకు కనీసం ఒక స్వీపర్ ఉద్యోగం కూడా రాదు, ఎందుకంటే ఆ ఉద్యోగానికి కూడా కొంత టాలెంట్ కావాలి అంటూ రాఖీ కెరీర్‌ను ఎండగట్టారు. చివరిగా.. నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి హాయిగా ఒకచోట కూర్చుని నా రీల్స్ చూస్తూ ఏడుస్తూ ఉండు అంటూ కంగనా ఇచ్చిన రిటార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కంగనా రనౌత్‌కు తనపై వచ్చే విమర్శలకు ఘాటుగా స్పందించే అలవాటు ఉంది. తనను ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేరుగా కౌంటర్ ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ వెనుకాడరు. ఈసారి కూడా రాఖీ వ్యాఖ్యలకు స్పందించిన తీరు చూస్తే.. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా, లేక రాఖీ నుంచి మరో కౌంటర్ వస్తుందా అనేది వేచి చూడాలి.